
వైద్య శాఖలో బదిలీలు షురూ!
● జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి క్యాడర్ల వారీగా కొనసాగుతున్న బదిలీలు ● జూమ్ ద్వారా నిర్వహించడంతో సాంకేతిక లోపాలు
గోస్పాడు: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి క్యాడర్ల వారీగా బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పక్రియ ఈనెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. జూమ్ మీటింగ్ ద్వారా ఉన్నతాధికారులు వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రి య ప్రారంభించారు. అయితే జూమ్ ద్వారా బదిలీ ప్రక్రియ నిర్వహిస్తుండడంతో పలుచోట్ల సిగ్నల్స్ అందక పోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికి అక్కడ ఆన్లైన్లో జూమ్ ద్వారా వైద్య ఉద్యోగులు బదిలీలను చూసుకోవాల్సి ఉన్నా జిల్లా కేంద్రానికి పరుగులు తీశారు. జిల్లా క్యాడర్లో జూనియర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎల్డీ కంప్యూటర్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, క్లాస్ –4 తో పాటు పలువురు ఆ విభాగంలో 57 మంది, జోనల్ విభాగంలో వీడియో గ్రాఫర్, హెల్త్ ఎడ్యుకేటర్, స్టాఫ్ నర్స్, ఫార్మసీ ఆఫీసర్తో పాటు పలు విభాగాల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న 19 మందితో పాటు మరో 42 మంది రిక్వెస్ట్పై బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఇదిలా ఉండగా 18న జరిగే బదిలీలకు జోనల్ విభాగంలో ఎంపీహెచ్ఈఓ, ఎంపీహెచ్ఎస్ (ఫిమేల్), పీహెచ్ఎన్, ఎంపీహెచ్ఎస్ (ఎం), సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లతో పాటు పలువురు ఐదేళ్లు పూర్తి చేసుకున్న 58 మంది, రిక్వెస్ట్పై మరో 16 మంది బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రస్థాయి క్యాడర్లో వైద్యులు ఐదేళ్లు పూర్తయిన వారు ఆరుగురు, రిక్వెస్ట్పై మరో 12 మంది డాక్టర్లు, సీహెచ్ఓ (ఎం)2, సీహెచ్ఓ (ఫిమేల్) రిక్వెస్ట్పై ఒకరు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు.