
జీవనంలో యోగా భాగం కావాలి
నంద్యాల(అర్బన్): ప్రతి ఒక్కరూ తమ జీవనంలో యోగాను భాగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఫరూక్ ముఖ్య అతిధిగా పాల్గొని యోగాసనాలు వేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తదితరులతో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 5200 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడం, ఏకాగ్రతను పెంచడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 7.6 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నమోదు అయ్యారన్నారు. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ అందరితో కలిసి యోగా చేయడంతో మానసిక ఉత్తేజితంగా ఉందని.. ప్రతినిత్యం అలవరచుకుంటే శరీరారోగ్యం బాగుంటుందన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇజల్లాలో శ్రీశైలం, మహానంది, బెలూం గుహలలో వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అదే విధంగా అహోబిలం, పచ్చర్లలో కూడా యోగా కార్యక్రమాలు చేయాల్సి ఉందన్నారు. అంతకుముందు రామచంద్ర మిషన్ యోగా గురువు ఆషా, బృంద సభ్యులు యోగాంధ్ర కార్యక్రమంలో పలు ఆసనాలు వేయించారు. కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఆయుష్ సీనియర్ మెడికల్ అధికారి యశోధర తదితరులు పాల్గొన్నారు.