
తల్లికి వందనంపై తల్లిదండ్రుల ఆందోళన
శిరివెళ్ల: తల్లికి వందనం పథకం నగదు బ్యాంక్ ఖాతాల్లో జమ కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ సచివాలయాలలో ప్రదర్శించిన జాబితాలలో పేర్లు లేని వారు పాఠశాలలకు పరుగులు తీస్తున్నారు. మండలంలో 6,916 మంది తల్లికి వందనం పథకానికి అర్హులు కాగా 925 మంది విద్యార్థులు అనర్హులయ్యారు. వారందరికీ నగదు జమ కాలేదు. మండల కేంద్రంలో 4 సచివాలయాలుంటే అందులో 419 మంది, యర్రగుంట్లలో రెండు సచివాలయాల్లో 113, గోవిందపల్లెలో 2 సచివాలయాలలో 111 మందికి నగదు పడలేదు. గుంప్రమాన్దిన్నెలో 51, జీనేపల్లె 49, కోటపాడు 59, చెన్నూరు 34, గంగవరం 24, మహదేవపురం 41, బోయలకుంట్లలో 24 మందికి నగదు జమ కాకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుని హెచ్ఎం గోవిందరాజుల వద్ద ఆరా తీశారు. అయితే తమకు సంబంధం లేదని, సచివాలయాల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే గత ప్రభుత్వంలో తమకు వచ్చిందని, ఈ ప్రభుత్వంలో ఎందుకు రాలేదని తల్లిదండ్రులు ప్రశ్నించారు. వికలాంగుడు ముల్లా ఉసేనీబాషా ట్రైసైకిల్పై వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ముగ్గురు పిల్లలు రౌలతో 5వ తరగతి, హర్షద్ 8వ ఆలియా 9వ తరగతి చదువుతున్నా ఒకరికి కూడా నగదు పడలేదన్నారు. ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గౌండా పని చేసుకుంటు జీవనం సాగిస్తున్న షేక్ ఖూజుబేగ్ ముగ్గురి పిల్లల పేర్ల జాబితాలో లేవు. 300 యూనిట్లు కరెంట్ బిల్లు, ఆధార్ నెంబర్లు సక్రమంగా లేవని పలువురికి నగదు జమ కాలేదని తెలుస్తోంది.
నగదు జమ కాకపోవడంతో పాఠశాలలు, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు

తల్లికి వందనంపై తల్లిదండ్రుల ఆందోళన