
వినతులను గడువులోగా పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన వినతులను క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పలు అంశాలపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..భూసర్వేకు సంబంధించి 292 దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్నాయని, గ్రామాల వారీగా గ్రామ సర్వేయర్లకు పంపి వారం రోజుల్లో పరిష్కరించాలన్నారు. రెవెన్యూకు సంబంధించి 1,131 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రామ సచివాలయ సర్వీసులకు సంబంధించి ఆధార్ సీడింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని, మన మిత్రకు సంబంధించి ఇంకా 11 వేల మందిని నమోదు చేయాలన్నారు. జియో ట్యాగింగ్కు సంబంధించి ఇంకా 683 సర్వీసులు పెండింగ్ ఉన్నాయని, అదే విధంగా ఈ–కేవైసీ వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో 172 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సమస్యలన్నింటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.