
తలసరి ఆదాయం పెంచేందుకు సహకరించండి
● కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో అధిక తలసరి ఆదాయం మహానంది మండలంలో ఉందని.. ఇదే తరహాలో అన్ని మండలాల్లో తలసరి ఆదాయం పెంచేలా బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కమ్యూలేటివ్ కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహరావు, ఎల్డీఎం రవీంద్ర కుమార్, పరిశ్రమల శాఖ జీఎం జవహర్ బాబు, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, బ్యాంకుల ప్రతినిధులు తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి స్థూల దేశీయోత్పత్తిని పెంచడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లా స్థూల దేశీయోత్పత్తి 2024–25 కు రూ.43,630 కోట్ల మేరకు చేరిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26కు రూ.50,711 కోట్ల మేరకు పెంచేలా బ్యాంకర్లు సహాయ సహకారా లు అందజేయాలన్నారు. కౌలు రైతులకు పెద్దఎత్తున సీపీఆర్సీ కార్డులు మంజూరు చేయడం ద్వారా వారికి రుణాలు లభిస్తాయన్నారు. పశుపోషకులను ప్రోత్స హించేందుకు ముందుకు రావాలన్నారు. కేంరద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్య ఘర్, పీఎం విశ్వకర్మ పథకాలకు బ్యాంకర్లు తప్పనిసరిగా చేయూత అందజేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 485 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అనంతరం 2025–26కు సంబంధించిన వార్షిక క్రెడిట్ ప్లాన్ను బ్యాంకర్లతో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.