నల్లగొండ టౌన్ : జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 1,54,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో పల్స్ పోలియో 94 శాతం పూర్తయింది. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి చుక్కలు వేయనున్నారు. నల్లగొండలోని జీజీహెచ్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.రాహుల్ ప్రారంభించారు. హెల్త్ జాయింట్ డైరెక్టర్ సుపర్ణతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ చిన్నారులకు విధిగా పోలియో చుక్కలను వేయించడం వల్ల వారి జీవితానికి భరోసా కల్పించినట్లు అవుతుందన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ విధిగా పోలియో చుక్కలను వేయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పద్మ, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ శంకర్, వైద్యసిబ్బంది, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


