నల్లగొండ : నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండలోని యాదవ సంఘం భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజస్థాన్లో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘చాత్రోంకి గూంజ్’ (విద్యార్థి యువత గొంతుక) మహా ఉద్యమానికి నల్లగొండ డీసీసీ మద్దతు నిస్తుందన్నారు. నీట్ పరీక్షల రద్దు, ప్రశ్నపత్రాల లీకేజీలు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, పెరుగుతున్న నిరుద్యోగం యువతను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడ స్వామి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్, ఏళ్ల రవీందర్ రెడ్డి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, వేముల గోపీనాథ్, బట్టు జంగయ్య, ఎండీ అజీజ్, చింత ధనుంజయ్, జమ్ము అశోక్, ఆకటి సైదులు, ఎండీ అమన్ పాల్గొన్నారు.
ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
నల్లగొండ టౌన్ : హైదరాబాద్లో ఈ నెల 28న నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం చైర్మన్ పిడమర్తి రవి కోరారు. మంగళవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో ఉద్యమకారులు సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పెన్షన్, 250 గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో మాతంగి అమర్, గురుపాటి సుదర్శన్, ఏర్పుల శ్రవణ్కుమార్, ఆసిఫ్ (అష్రఫ్), ముస్తఫా, నాగరాజు, వెంకన్న, శ్రీకాంత్గౌడ్ పాల్గొన్నారు.
యాప్లతో వ్యవసాయం చేయలేం
నల్లగొండ టౌన్ : ఎరువుల యాప్ ద్వారా రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేంద ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. వానా కాలం సీజన్ ఆరంభమైనందున రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్దంగా ఉంచాలన్నారు. దుకాణాల్లో డీఏపీ, యూరియాను అమ్మేవిదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులను విడుదల చేయాలి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, డబ్బికార్ మల్లేషం, నారి అయిలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్హాషం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


