నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని నల్లగొండ–దేవరకొండ రోడ్డులోని హౌసింగ్ బోర్డు కాలనీలో వాణిజ్య అవసరాలకు కేటాయించిన ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సోమవారం నిర్వహించిన బహిరంగ వేలానికి భారీ స్పందన లభించింది. మొత్తం 31 ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ.44.15 కోట్ల ఆదాయం సమకూరినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి.గౌతం వెల్లడించారు. ప్రతి ప్లాట్ 233 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండగా, చదరపు గజానికి రూ.20 వేల కనీస ధరను నిర్ణయించారు. అయితే కొనుగోలుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో గరిష్టంగా చదరపు గజానికి రూ.75,500, కనిష్టంగా రూ.55,500 ధర నమోదైంది. ఈ వేలంలో భూములను కొనుగోలు చేసేందుకు 201 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. ఈ పాట్లు నల్లగొండ ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో ఉండటం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడం, భూములకు ఎలాంటి వివాదాలు లేకపోవడం వంటి కారణాలతో ప్లాట్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని గౌతం తెలిపారు. మొత్తం విక్రయాల్లో చదరపు గజానికి సగటున రూ.61 వేల ధర వచ్చినట్లు ఆయన తెలిపారు.
వేలంలో రికార్డుస్థాయిలో ధర పలికిన కమర్షియల్ స్థలాలు
ఫ 31 ప్లాట్ల విక్రయంతో ప్రభుత్వానికి రూ.44.15 కోట్ల ఆదాయం


