6,362 కేసుల పరిష్కారం
నల్లగొండ : జాతీయ మెగా లోక్అదాలత్లో 6,362 కేసులు పరిష్కారమైనట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నిర్వహించిన లోక్అదాలత్కు హాజరైన నిందితులు, కక్షిదారులకు అవగాహన కల్పించి జిల్లా వ్యాప్తంగా 6,362 కేసులు పరిష్కరించామని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన 45 మంది బాదితులకు రూ.8,84,642 అందజేశారని తెలిపారు. ఈ కేసులను పరిష్కరించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని, కోర్టు కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు.
రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సోమయ్య
నల్లగొండ టౌన్ : అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సోమయ్య ఎన్నికయ్యారు. శనివారం రాత్రి నల్లగొండలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్గ ఎన్నిక జరిగింది. గౌరవాధ్యక్షుడిగా మేక రాంరెడ్డి, అధ్యక్షునిగా కోడి సోమయ్య, ఉపాధ్యక్షుడిగా ఉక్లా, ప్రధాన కార్యదర్శిగా కోమటిరెడ్డి అనంతరెడ్డి, కార్యదర్శిగా పాతూరి శ్రీనివాస్రావు, కోశాధికారిగా ఎం.అంజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని తీర్మానించారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
మునుగోడు : మండలంలోని పలివెల జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు గేర నర్సింహను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా అధికారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం ఆ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థి హనుమాన్ మాల వేసుకొని పాఠశాలకు రాగా.. ఉపాధ్యాయుడు నర్సింహ అసభ్యంగా మాట్లాడటంతో పాటు మాల తీసి పాఠశాలకు రావాలని ఆదేశించాడు. దీంతో ఈ విషయం తెలిసినా కుటుంబ సభ్యులు, పలువురు మాలదారులతో పాటు బీజేపీ నాయకులు అదే రోజు ఆ పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకొవాలని అదనపు కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ చేసిన అధికారులు ఉపాధ్యాయుడు నర్సింహను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
19న కబడ్డీ జట్ల ఎంపిక
నిడమనూరు : నల్లగొండ జిల్లా సీనియర్ పురుషుల, మహిళల కబడ్డీ జట్ల ఎంపికను ఈ నెల 19న మధ్యాహ్నం నిడమనూరులో నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శలు ఆర్.భూలోకరావు, జి.కర్తయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుషుల విభాగంలో 85 కేజీలలోపు, మహిళల విభాగంలో 75 కేజీలలోపు ఉండాలని పేర్కొన్నారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో రావాలని సూచించారు.
కోలుకుంటున్న చిన్నారులు
నాగార్జునసాగర్ : ఇంజెక్షన్ వికటించి అస్వస్థతతకు గురైన 17మంది చిన్నారులు ప్రాణాపాయం తప్పడంతో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కొంతమంది ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యులు పైఅధికారులకు సమాచారం ఇచ్చి.. వారి సలహాల మేరకు వైద్యం అందించడంతో పిల్లలంతా ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఆదివారం ఆరుగురు చిన్నారులు డిశ్చార్జ్ అయినట్లుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ భానుప్రసాద్ తెలిపారు. 11మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారంతా త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.


