
ప్రైవేట్లో ఫీజుల దోపిడీ
నోటీసులతో
సరిపెట్టుకుంటున్న అధికారులు..
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నా వాటి అనుమతులు, ఇతర శాఖల పర్మీషన్లు విషయాలపై విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అనుమతి లేని పాఠశాలలను గుర్తించి కేవలం నోటీసులు జారీ చేసి వదిలేస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం, ఫీజుల నియంత్రణ చేయకపోవడం, ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఎల్కేజీకి రూ.40వేల పైమాటే..
ఫ అనుమతి లేకుండానే పాఠశాలల ఏర్పాటు
ఫ ఒకే పర్మిషన్తో అనేక బ్రాంచ్లు
ఫ పుస్తకాలు, యూనిఫాం, షూ
స్కూల్లోనే అమ్మకం
ఫ పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
మిర్యాలగూడ : సేవా దృక్పథంతో ఉండాల్సిన విద్యా వ్యవస్థ వ్యాపార రంగంగా మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పరడడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు. తాము పడ్డ కష్టం తమ పిల్లలు పడవద్దని, ఎంత ఖర్చయినా సరే మంచిగా చదివించాలనే తల్లిదండ్రుల కలలను ఆసరా చేసుకున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అందిన కాడికి దోచుకుంటున్నాయి. ప్లే, టెక్నో, సీబీఎస్ఈ, ఒలింపియాడ్, ఐఐటీ ఫౌండేషన్ పేరిట తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది రూపాయలు ఫీజులు గుంజుతున్నాయి. పైగా పాఠశాలల్లోనే పుస్తకాలు యూనిఫాం, టై, బెల్టులు కొనాలని నిబంధన పెట్టి వాటి పేరిట కూడా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం అనమానాలకు తావిస్తోంది.
ట్యాగ్లు పెట్టి మరీ..
ప్రైవేట్ పాఠశాలలకు ప్లే, టెక్నో, సీబీఎస్ఈ, ఒలింపియాడ్, ఐఐటీ ఫౌండేషన్ వంటి పేర్లతో కార్పొరేట్ ట్యాగ్లు పెట్టి మరీ దోపిడీ చేస్తున్నారు. వీటికి అనుమతులు లేకపోయినప్పటికీ అనధికారికంగా ట్యాగ్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా క్లాస్లు బోధిస్తామని చెప్పి వాటి పేరిట వేలాది రూపాయలు గుంజుతున్నారు. వీటి కోసం ప్రత్యేక పుస్తకాలను తమ పాఠశాల పేరుతో ముద్రించి వాటిని కొనుగోలు చేసేలా తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తీరా పుస్తకాలను కొన్నాక ఆ పుస్తకాల సిలబస్ను బోధించే పాపాన పోవడం లేదు.
జిల్లాలో 369 ప్రైవేట్ పాఠశాలలు..
జిల్లాలో 369 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అనుమతి లేకుండానే చాలా పాఠశాలు నడుస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో 1,25,572 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో బయటి మార్కెట్లో దొరికే వస్తువుల ధరలకు ప్రైవేట్ పాఠశాలల్లో లభించే వాటికి చాలా వ్యత్యాసం ఉంటోంది. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు పుస్తకాలు, బూట్లు, యూనిఫాం, టై, బెల్టు, గుర్తింపు కార్డులు తదితర వాటి పేరుతో ఫీజులు కాకుండా రూ.4 నుచి రూ.10వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విక్రయించే పాఠ్య పుస్తకాలు మార్కెట్లో ఎక్కడా దొరకకపోవడంతో గత్యంతరం లేక వాటినే తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఇతర పేర్లతో స్కూల్స్ నిర్వహణ
ప్రైవేట్ పాఠశాలల్లో చాలా వరకు అనుమతులు ఉండడం లేదు. మూతపడ్డ పాఠశాల అనుమతుల పేరిట తమ సొంత పేరు పెట్టుకుని పాత పాఠశాల అనుమతితోనే కొనసాగిస్తున్నారు. ప్రతి మండలంలో ఇలా 10 నుంచి 15 పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, హాలియా ప్రాంతాల్లో బడా కార్పొరేట్ పాఠశాలలు వాటి బ్రాంచ్లను అనధికారికంగా ఏర్పాటు చేస్తున్నాయి. అంతేకాకుండా అనుమతులు లేకుండానే ప్లే గల్లిగల్లీలో స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్లు, ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో కూడా పాఠశాలలను నడిపిస్తున్నారు. కనీసం సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచుకోకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
స్కూల్ ఫీజు 20,000
ఎల్కేజీ ఖర్చు ఇలా
(సుమారు రూపాయల్లో..)
టై, బెల్టు,
యూనిఫాం 3,000
అడ్మిషన్ ఫీజు
3,000
పుస్తకాలు4,000
రవాణా చార్జీలు 15,000
నల్లగొండకు చెందిన ఓ చిరుద్యోగి తన కుమారుడిని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ చేయాలనుకున్నాడు. పాఠశాలకు వెళ్లి ఫీజు వివరాలు అడిగాడు. అడ్మిషన్ ఫీజు, స్కూల్ ఫీజు, పుస్తకాలు, టై, బెల్టు, యూనిఫాం, రవాణా చార్జీలు కలుపుకొని ఏడాదికి మొత్తం రూ.40వేలు అవుతాయని స్కూల్ యాజమాన్యం చెప్పింది. దీంతో అతడు ఎల్కేజీకే ఇంతా ఫీజా అని అవాక్కయ్యాడు. ఇలా జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా సాగుతోంది.
అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం
జిల్లాలో అనుమతి లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతిలేని పాఠశాలలను సీజ్ చేయాలని ఇప్పటికే ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. ఎవరైనా పాఠశాలల పేర్లు మార్పడం కానీ, ఒకే పాఠశాలకు అనుమతి తీసుకోని అనేక బ్రాంచ్లు ఏర్పాటు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. పుస్తకాలు, యూనిఫాంలు అదే పాఠశాలలో కొనాలన్న నిబంధన లేదు. కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తే ఉపేక్షించేది లేదు.
– భిక్షపతి, డీఈఓ

ప్రైవేట్లో ఫీజుల దోపిడీ