
ప్రజలకు అందుబాటులో ఉండాలి
మిర్యాలగూడ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె దామరచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్, మందుల స్టాక్ను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. సమయానుకూలంగా వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కావాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, వైద్యం కోసం వచ్చిన రోగులను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకోని వైద్యం అందించాలని, కేసులు సీరియస్గా ఉన్నప్పుడు మాత్రమే నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి లేదా ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని ఆకస్మింగా తనిఖీ చేసి పిల్లలను పరిశీలించారు. అంతేకాక నిర్మాణంలో ఉన్న టాయ్లెట్స్ పనలను పరిశీలించారు. అంతకుముందు కేజీబీవీని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. ఆమె వెంట సబ్కలెక్టర్ నారాయణ్అమిత్, మండల ప్రత్యేకాధికారి పత్యానాయక్, డీఈఓ భిక్షపతి, అధికారులు ఉన్నారు.
భవిత కేంద్రం పరిశీలన
మిర్యాలగూడ : భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలందరినీ నమోదు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లలకు కృత్యాధార పద్ధతుల్లో విద్యను అందిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యాశాఖ ద్వారా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఆమె వెంట డీఈఓ భిక్షపతి తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి