యూరియా కోటాలో కోత! | - | Sakshi
Sakshi News home page

యూరియా కోటాలో కోత!

Jun 17 2025 4:55 AM | Updated on Jun 17 2025 4:55 AM

యూరియ

యూరియా కోటాలో కోత!

సిఫారసు మేరకే యూరియా వాడాలి

రైతులు ఆయా పంటలకు సిఫారసు మేరకే యూరియాను వాడాలి. యూరియాను అధిక మోతాదులో వాడటం వల్ల చీడపీడలు, తెగుళ్లు అధికమవుతాయి. రైతుల నానో యూరియాను వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రసాయన ఎరువులు తగ్గించకుని నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.

– పాల్వాయి శ్రవణ్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయాధికారి

మోతాదుకు మించి

వాడకుండా చర్యలు

రాయితీ దుర్వినియోగం

కాకుండా అడ్డుకట్ట

భవిష్యత్‌లో పొంచి ఉన్న

యూరియా కొరత

రైతులకు అవగాహన

కల్పిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

గుర్రంపోడు : యూరియా కోటాను కేంద్రం తగ్గిస్తోంది. రైతులు అధిక మోతాదులో యూరియా వాడకాన్ని తగ్గించేలా.. రాయితీపై అందిస్తున్న యూరియా పక్కదాటి పట్టకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే.. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో భవిష్యత్‌లో యూరియా కష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి. జిల్లాలో సాగయ్యే అన్ని పంటలకు కలుపుకుని లక్షా 40 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. కానీ 30 శాతం తక్కువగా యూరియా కేటాయిస్తున్నారు. సెప్టెంబర్‌ నాటికి 70 వేల మెట్రిక్‌ టన్నుల అవసరం. ఇప్పటి వరకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల కోటా 20 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది. నల్లగొండ జిల్లాలో గోదాములు ఎక్కువగా ఉండడంతో యూరియా ఇక్కడికి ఎక్కువగా పంపుతున్నారు. తర్వాత ఇక్కడి నుంచి వేరే జిల్లాలకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జూలై నుంచి జిల్లాకు సరిపడా కోటా విడుదల అవుతుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఇప్పటికే 39 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా పాత నిల్వలు ఉండడంతో ప్రస్తుత వానాకాలం సీజన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అధికారులు భావిస్తున్నారు.

ఓటీపీ, వేలిముద్రతోనే పంపిణీ

వ్యవసాయశాఖ ఇటీవల ఎరువుల డీలర్లకు కొత్త ఈపాస్‌ యంత్రాలను పంపిణీ చేసింది. యూరియా కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా తమ సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీని డీలర్‌కు చెప్పడం లేదా వేలిముద్ర వేయడం ద్వారానే యూరియా, ఇతర ఎరువులు కొనాల్సి ఉంటుంది. దీంతో యూరియా పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ పక్కాగా ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అండగా ఉండేలా.. భారీగా రాయితీతో అందిస్తున్న యూరియా.. పక్కదారి పట్టి రసాయన పరిశ్రమలకు వాడుతుండటం వల్ల రాయితీ దుర్వినియోగం అవుతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నీమ్‌ కోటెడ్‌ యూరియాను వినియోగంలోకి తెచ్చింది.

అధిక మోతాదులో వాడితే నష్టమే..

యూరియాతో పోలిస్తే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు నాలిగింతలు అధికంగా ఉండటం, రసాయన ఎరువుల వాడకంపై సరైన అవగాహనలేకపోవడం వల్ల రైతులు యూరియాను విచ్చలవిడిగా వినియోగించి నష్టపోతున్నారు. ఎకరా వరికి రెండు బస్తాల యూరియా వాడాల్సి ఉండగా నాలుగు నుంచి ఆరు బస్తాల వరకు వాడుతున్నారు. యూరియాను వాడటం వల్ల పైరు పచ్చగా ఏపుగా ఉంటుంది. అధిక మోతాదులో వేసినప్పుడు తేలికగా నీటిలో కొట్టుకుని పోయి పైరుకు ఉపయోగపడదు. మొక్కలు సుకుమారంగా పెరగడం వల్ల చీడపీడలు, తెగుళ్ల బారిన పడతాయి. దీంతో పెట్టుబడి అధికమవుతుంది. వరి పైరు విపరీతంగా పెరిగి కోత సమయంలో పంట దిగుబడి పడిపోతుంది. పూత ఆలస్యంగా వచ్చి పంట కాలం పొడగించబడి దిగుబడి తగ్గుతుంది. వరిలో పూత దశ తర్వాత యూరియాను వేస్తే బియ్యపు గింజలో పొట్ట తెలుపు వచ్చి నూక ఎక్కువ అవుతుంది. అధిక మొత్తంగా యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

యూరియా వాడకంలో మెలకువలు

ద్రవ రూప నానో యూరియా సాధారణ యూరియాతో సమానంగా పనిచేస్తుంది. నానో యూరియాను పిచికారీ చేయడం వల్ల వేగంగా మంచి ఫలితాలు వస్తాయి. రైతుకు బస్తాల భారం తగ్గుతుంది.

మెట్ట పైర్లలో యూరియా వేసేటప్పుడు నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. మెట్టపైర్లలో యూరియాను చల్లడం కన్నా మొక్క మొదట్లో గుంట తీసి వేస్తే మంచిది.

పైరుకు సిఫారసు చేసిన యూరియాను రెండు, మూడు దఫాలుగా వేసుకోవాలి.

యూరియాతోపాటు వేప పిండి (50 కేజీల యూరియాకు 5 కిలోల వేపపిండి) వాడితే నత్రజని మొక్కలకు ఎక్కువ కాలం అంది చీడపీడల వ్యాప్తి తగ్గుతుంది.

పైరును బట్టి సేంద్రియ ఎరువులు, రైబోజియం మొదలగు జీవన ఎరువులు వాడి యూరియా మోతాదును తగ్గించుకోవచ్చు.

కాంప్లెక్స్‌ ఎరువుల్లో కూడా నత్రజని ఉంటున్నందున యూరియాను జోడించి వాడకూడదు.

యూరియా కోటాలో కోత!1
1/1

యూరియా కోటాలో కోత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement