
రైతు భరోసా నిధులు విడుదల
నల్లగొండ అగ్రికల్చర్ : వానకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఎకరానికి రూ.6000 చొప్పున రైతు భరోసాను జమ చేయనుంది. జిల్లాలోని 4,36,944 మందికి సంబంధించి రూ.411,34,37,740 ట్రెజరీకి పంపించింది. సోమవారం సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బు జమవుతోంది. ఇప్పటి వరకు రెండెకరాలలోపు భూమి ఉన్న 3,03,059 మంది రైతుల ఖాతాల్లో రూ.180.09 కోట్లు జమయ్యాయి.
పోలీస్ గ్రీవెన్స్ డేలో
వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ సోమవారం 45 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి.. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు.
ఐటీఐలో ప్రవేశాలకు నోటిఫికేషన్
రామగిరి(నల్లగొండ) : ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయినట్లు ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జంజిరాల వెంకన్న తెలిపారు. జూన్ 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ మెమో, ఆధార్ కార్డు వివరాలు ఒకే విధంగా ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలకు www.ititelangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
22న ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీలు
నల్లగొండ టూటౌన్ : చెస్ చాంపియన్ దివంగత మేకల అభినవ్ 35వ జయంతిని పురస్కరించుకొని ఈనెల 22న నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.కరుణాకర్రెడ్డి, విశ్వప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–7, 9, 11, 13, 15 బాల, బాలికలకు పోటీలు ఉంటాయని, 50మంది విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 9985423823 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
నల్లగొండ : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష పలితాలను సోమవారం ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జిల్లాలో మొదటి సంవత్సరంలో మొత్తం 7,617 మందికి 5196 ఉత్తీర్ణులై 68.22 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ 3,771 మందికి 2537 మంది ఉత్తీర్ణులై 67.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో మొదటి సంవత్సరం 925 మందికి 641 మంది(69.3 శాతం), ద్వితీయ సంవత్సరంలో 657 మందికి 402 మంది ఉత్తీర్ణులై 61.19 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఉపాధి హామీ
పనుల పరిశీలన
తిప్పర్తి : ఉపాదిహామీ పథకం కింద మండలంలోని ఇండ్లూర్, తిప్పర్తి, యర్రగడ్డలగూడెం గ్రామాల్లో చేసిన పనులను ఉపాధిహామీ పథకం జాతీయ కమిటీ సభ్యుడు ఉమాశంకర్, ఏపీడీ నర్సింహారావు సోమవారం పరిశీలించారు. ఇంకుడు గుంతలు, బోర్ రీచార్జి గుంతలు అసంపూర్తిగా ఉండడంతో వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డి, ఏపీఓ శిరీష, ఈసీ జుల్పేకర్ తదితరులు ఉన్నారు.

రైతు భరోసా నిధులు విడుదల