
రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం
నల్లగొండ, చింతపల్లి : వ్యవసాయాన్ని పండగ చేయడంలో భాగంగా రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా సోమవారం చింతపల్లి మండంలోని నెల్వలపల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతులు వాణిజ్య పంటలు పండించేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. సోలార్ ద్వారా పంపుసెట్లు నిర్వహించుకునేలా చూడాలన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే విధంగా, నూతన సాంకేతికతపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రైతు వేదిక పక్కనే గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చూడాలని ఎమ్మెల్యే కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.
మహిళా రైతుతో ముఖ్యమంత్రి ముఖాముఖి
చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు బిక్కని రాణెమ్మ ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తనకు నాలుగెకరాల భూమి ఉందని.. సన్న వడ్లు వేశానని 8 పుట్ల దిగుబడి వచ్చిందని.. బోనస్ కింద రూ.15,000 తన ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. రూ.లక్షా 80 వేలు రుణమాఫీ అయ్యిందని.. రూ.17,100 రైతు భరోసా వచ్చిందని అందుకు రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ పిల్లలు బాగా చదువుకుంటున్నారని.. ప్రభుత్వం తమను ఇలాగే ఆదుకోవాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి.. రాణెమ్మతో మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించాలని చదితేనే భవిష్యత్ ఉంటుందన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి