
పల్లెల్లో స్థానిక సందడి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమ వుతుండటంతో గ్రామాల్లో రాజకీయ నేతల్లో హడావుడి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. స్థానిక సంస్థల పదవీకాలం ముగిసినా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడే పరిస్థితి నెలకొంది. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే స్థితిలో ప్రభుత్వం లేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటన ఇందుకు ఊతం ఇస్తోంది.
మొదట ప్రాదేశిక ఎన్నికలు
మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాతే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే జూలై రెండో వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలంటే ఈ నెల చివరిలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ ఇస్తే వచ్చే నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది.
ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రచారం జరగడంతోపాటు ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామ పంచాయతీల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఏర్పాట్లతో పాటు బ్యాలెట్ బాక్సులను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పించి వాటికి మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచారు. గ్రామాలు, ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేశారు. బ్యాలెట్ పేపర్లను తెచ్చి ఎస్పీ కార్యాలయంలో భద్రపరిచారు. ఎన్నికల సంఘం ఎప్పుడు షెడ్యూల్ ప్రకటించినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని యంత్రాంగం చెబుతోంది.
బీసీ రిజర్వేషన్లు తేలకపోవడంతో వాయిదా..
బీసీ రిజర్వేషన్ల తేలకపోవడంతో గతంలో నిర్వహించాలనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయం ఇప్పటికీ కోర్టులో ఉంది. ఆ సమస్య ఎటూ తేలలేదు. కానీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పెరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు
గత ఎన్నికల్లో జిల్లాలో 31 మండలాలు ఉండగా ఆ తరువాత రెండు మండలాలు (గట్టుప్పల్, గుడిపల్లి) కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో రెండు జెడ్పీటీసీ స్థానాలు పెరుగనున్నాయి. దీంతో జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 33కు చేరకుంది. అదే విధంగా జిల్లాలో గత ఎన్నికల సమయంలో 349 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇటీవల చేపట్టిన ఎంపీటీసీ స్థానాల పునర్విభజనలో మరో 3 పెరిగాయి. దీంతో ఎంపీటీసీల సంఖ్య 352 చేరింది. ఇక గ్రామ పంచాయతీలు గతంలో 844 ఉండగా.. కొత్తగా 24 పంచాయతీలు పెరిగాయి. దీంతో పంచాయతీలసంఖ్య 868కి చేరింది.
జెడ్పీ చైర్మన్ మినహా మిగతా రిజర్వేషన్లు ఇక్కడే..
జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి ఆయా నియోజక వర్గాల వారీగా ఉన్న జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. వాటిని కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. అయితే పంపిన జాబితా ఆధారంగా రిజర్వేషన్లకు ప్రభుత్వం ఆమోదించి తిరిగి జిల్లాకు పంపుతుంది. జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ మాత్రమే రాష్ట్ర స్థాయిలో ప్రకటిస్తారు.
ఫ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్
వచ్చే అవకాశం
ఫ మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ఫ ఆ తరువాతే పంచాయతీలకు..
ఫ సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం
ఫ గ్రామాల్లో మొదలైన రాజకీయ సందడి
స్థానిక సంస్థల వివరాలు ఇలా..
జెడ్పీటీసీలు 33
ఎంపీటీసీలు 352
గ్రామ పంచాయతీలు 868
ఓటర్లు 10,78,335
సిద్ధమవుతున్న పార్టీలు
జిల్లాలో రాజకీయ పార్టీలు స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజక వర్గాలుంటే సూర్యాపేట మినహా 11 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తాము అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అంతకుముందు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీజేపీకి జిల్లాలో ఎమ్మెల్యేలు లేకపోయినా ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.