
భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం
చందంపేట : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గతంలో ధరణిలో గత ప్రభుత్వం చాలా తప్పిదాలు చేసిందని, రైతులను ఇబ్బందులకు గురిచేసే పనులు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ రైతులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో భూ భారతిచట్టం–2025ను తీసుకొచ్చిందన్నారు. చందంపేట మండల కేంద్రంలో సోమవారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి.. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా తహసీల్దార్ స్థాయిలోనే ఎక్కువగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మే 1 నుంచి అన్ని జిలాల్లో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్తుగా ఎంపిక చేస్తామన్నారు. చందంపేటను కూడా పైలెట్ ప్రాజెక్టుగా చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం 6వేల మంది లైసెన్స్ సర్వేయర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డులాగే రైతులకు భూదార్ కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో భూమి అమ్మినా.. కొన్నా.. మ్యాపింగ్ ఉండేది కాదని, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాపింగ్ తప్పనిసరి చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ వెనుకబడిన ఈ ప్రాంతంలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, సాగర్ ముంపునకు గురై ఇక్కడికి వచ్చిన రైతులే ఎక్కువ మంది ఉన్నారని, డీఫారెస్ట్ పట్టాలు కలిగి ఉన్న రైతుల వివరాలు ఆన్లైన్ నుంచి తొలగించబడ్డాయని అన్నారు. చందంపేట మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని భూ సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్నాయక్ మాట్లాడుతూ భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా నిజమైన రైతులకే లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కాగా.. రైతులు ప్రస్తావించిన సమస్యలపై ఆర్డీఓ నుంచి సరైన సమాధానం రాకపోవడంపై మంత్రి.. ఆర్డీవోను మందలించారు. అనంతరం నేరెడుగొమ్ము మండల కేంద్రంలో రైతులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్డీవో రమణారెడ్డిలు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక, ఆర్డీఓ రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొండ్ర శ్రీశైలంయాదవ్, కృష్ణయ్య, బద్యానాయక్, సర్వయ్య, గోవింద్యాదవ్, సురేష్గౌడ్ పాల్గొన్నారు.
ఫ ఆధార్ కార్డు మాదిరిగానే.. భూదార్ కార్డు
ఫ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఫ చందంపేటలో భూ భారతి చట్టంపై అవగాహన

భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం