యువతకు ఉపయోగపడని యూత్‌ హాస్టల్‌ | - | Sakshi
Sakshi News home page

యువతకు ఉపయోగపడని యూత్‌ హాస్టల్‌

Apr 20 2025 1:54 AM | Updated on Apr 20 2025 1:54 AM

యువతకు ఉపయోగపడని యూత్‌ హాస్టల్‌

యువతకు ఉపయోగపడని యూత్‌ హాస్టల్‌

నాగార్జునసాగర్‌: యువతకు ఉపయోగపడేలా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గతంలో దేశవ్యాప్తంగా 143 యూత్‌ హాస్టల్స్‌ ఏర్పాటు చేయగా.. అందులో భాగంగా తెలంగాణలో మూడు ఏర్పాటు చేశారు. ఈ మూడింటిలో ఒక దానిని నాగార్జునసాగర్‌లో సుమారు ఐదెకరాలలో నిర్మించారు. ఈ యూత్‌ హాస్టల్‌ నిర్మాణానికి 1997లో శంకుస్థాపన చేసి.. 2003లో ప్రారంభించారు. ఇది నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారి వెంట ఉంది. ఇందులో ఏడు డార్మెట్లు ఉండగా 3 మహిళలు, 4 పురుషులు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. 100మంది వరకు బస చేయవచ్చు. యువత విహారయాత్రకు వచ్చినప్పుడు గ్రూపులుగా ఒకే చోట కలుసుకునేందుకు, నాలెడ్జ్‌ ఎక్స్చేంజ్‌కు ఉపయోగపడేలా దీనిని నిర్మించారు. గతంలో ఇందులో బస చేసేందుకు ఒక్కరికి ఒకరోజుకు కేవలం రూ.30 అద్దె ఉండేది. తర్వాత రూ.50 చేయగా.. ప్రస్తుతం రూ.80 చేశారు. ఇందులో రెండు గదులు కూడా ఉండగా.. వాటికి అద్దె ప్రారంభంలో రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.500 ఉంది. అయితే ఈ యూత్‌ హాస్టల్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి కేవలం లాడ్జీలుగా ఉపయోగపడ్డాయి. 2015 వరకు ఇందులో పనిచేసే కేర్‌టేకర్‌, తోటమాలి, స్వీపర్లకు వేతనాలు పోగా రూ.14,86,000 నగదు నిల్వలు ఉన్నాయి. అయితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నాగార్జునసాగర్‌లో శిక్షణ ఇచ్చిన సమయంలో ఆ డబ్బులను ఖర్చు చేసి గతంలో ఉన్న బెడ్‌లు, బెడ్‌షీట్లు మార్చేందుకు, తదితర ఖర్చులకు వినియోగించారు. ఈ యూత్‌ హాస్టల్‌ ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ రంగులు కూడా వేయలేదు. గత 54నెలలుగా ఇందులో పనిచేసే వారికి వేతనాలు ఇవ్వలేదు. ఏమైనా అద్దెలు వస్తే సుమారు రూ.50వేలు జమ అయితే ఒకటి, రెండు నెలలకు చెక్కులు రాసి వేతనాలు అందిస్తుంటారు. నెహ్రూ యువకేంద్రం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ ఈ యూత్‌ హాస్టల్‌కు మేజనేజర్‌గా వ్యవరిస్తుండగా.. దీనికి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఇలాంటి యూత్‌ హాస్టళ్లు తెలంగాణలో సికింద్రాబాద్‌లోని బోట్స్‌ క్లబ్‌లో, హనుమకొండలో ఉన్నాయి.

లీజుకు అడిగిన పర్యాటక అభివృద్ధి సంస్థ

ఇటీవల తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ యూత్‌ హాస్టల్‌ను సందర్శించింది. దీనిని ఆధునీకరించి వినియోగంలోకి తీసుకొస్తే పర్యాటకులు బస చేసేందుకు ఉపయోగపడుతుందని లీజుకు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. అప్పట్లో నాగార్జునసాగర్‌ డ్యాంపై సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది పహారాగా ఉన్నారు. వారు బస ఇందులో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వారు తెలంగాణ వైపు పహారా విధుల నుంచి విరమించుకొని వెళ్లిపోయారు. దీంతో ఈ యూత్‌ హాస్టల్‌ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. దీనిని పర్యాటక అభివృద్ధి సంస్థకు లీజుకు ఇస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర, జిల్లా అధికారులు సమాలోచనలు చేసి ప్రజలకు ఉపయోగపడేలా ఈ యూత్‌ హాస్టల్‌ను వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

గతంలో డ్యాం భద్రతకు వచ్చిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి ఈ హాస్టల్‌ కేటాయింపు

వారు వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే..

ఆదాయం రాక సిబ్బందికి వేతనాలు

ఇవ్వలేని దుస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement