
పవర్ప్లాంట్లో టౌన్షిప్
వైటీపీఎస్ ఉద్యోగుల కోసం రూ.928.52 కోట్లతో క్వార్టర్లు నిర్మించనున్న జెన్కో
మిర్యాలగూడ : దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ (వైటీపీఎస్) ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టనుంది. థర్మల్ పవర్ప్లాంట్లో వేల సంఖ్యలో ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మికులు రాత్రింబవళ్లు పనిచేయనున్నారు. ఇటీవల పలువురు ఏఈలు, డీఈలను సైతం ఇక్కడికి బదిలీ చేశారు. వీరంతా స్థానికంగా నివాసం ఉండాల్సి రావడంతో జెన్కో క్వార్టర్లు నిర్మిస్తోంది. టౌన్షిప్ నిర్మాణానికి ఇటీవలే టెండర్లు దాఖలయ్యాయి. టెండర్ ఆమోదించిన తరువాత 30 నెలల్లో టౌన్షిప్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని జెన్కో గడువు నిర్ణయించింది. నిర్మాణ వ్యయం రూ.928.52కోట్లు అయినప్పటికీ జీఎస్టీ, ఇతర ఖర్చులతో కలిిపి రూ.12,200 కోట్లు దాటవచ్చని తెలుస్తోంది.
మొత్తం 2,970 ఫ్లాట్లు నిర్మాణం
డిజైన్లు, డ్రాయింగ్స్ ప్రకారం మొత్తం 3,52,771.02 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టౌన్షిప్ నిర్మాణం జరగనుంది. 2,21,903.67 చ.మీ విస్తీర్ణంలో నివాస గృహ సముదాయాలతో లేఅవుట్ తయారు చేశారు. 75.185 చ.మీ విస్తీర్ణంలో పార్కులు, మొక్కల పెంపకం, పచ్చిక బయళ్లు, మరో 55,682.35 చ.మీల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర సముదాయాలను ఏర్పాటు చేస్తారు. ఉన్నతాధికారుల కోసం ఏ–టైప్ రెండు ఇండిపెండెంట్ క్వార్టర్లు, బి–టైప్లో ఆరు ఇండిపెండెంట్ క్వార్టర్లను నిర్మిస్తున్నారు. అధికారులకు డి, ఈ టైప్ క్వార్టర్లను, కార్మికలకు ఎఫ్– టైప్ క్వార్టర్లను నిర్మిస్తారు. ఈ భవనాలు 11 అంతస్తుల ఎత్తు ఉంటాయి. డీ, ఈ–టైప్ క్వార్టర్ల కోసం రెండు భవనాలు ఉంటాయి. వీటిల్లో 360 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. ఎఫ్–టైప్ క్వార్టర్లలో 1,350 ఫ్లాట్లు మొత్తం కలిపి 2,970 ఫ్లాట్లు నిర్మించనున్నారు.
సకల సదుపాయాలతో..
టౌప్షిప్లో ఉద్యోగులకు సకల సదుపాయాలు కల్పి స్తారు. అగ్నిమాపక కేంద్రం, ఆసుపత్రి, పాఠశాల భవనాలు, క్లబ్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, మల్టీపర్పస్ ఫంక్షన్హాల్, స్పో ర్ట్స్ కాంప్లెక్స్, సెక్యూరిటీ రూమ్స్, మెయింటెన్స్ ఆఫీస్, రోడ్లు, డ్రెయినేజీ, అండర్గ్రౌండ్ పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్లు, పార్కింగ్ షెడ్స్, పచ్చదనం, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, తుంగపాడు వాగుపై బ్రిడ్జి, కాంపౌండ్ వాల్, టౌన్షిప్కు అప్రోచ్ రోడ్డును జెన్కో నిర్మించనుంది. టౌన్షిప్ నుంచి విడుదలయ్యే మురుగు నీటిని శుద్ధి చేయడానికి రోజుకు వెయ్యి కిలో లీటర్ల శుద్ధి సామర్థ్యంతో సీవరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సైతం నిర్మిస్తుంది.
టెండర్ల ప్రక్రియ పూర్తయింది
టౌన్షిప్ నిర్మాణానికి ఇటీవలే టెండరు దాఖలు చేసే ప్రక్రియ పూర్తయింది. త్వరలో టెండర్లు ఓపెన్ చేయగానే టౌన్షిప్ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. సకల సౌకర్యాలతో నిర్మించే టౌన్షిప్ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– సమ్మయ్య,
యాదాద్రి పవర్ ప్లాంట్, చీఫ్ ఇంజనీర్
ఫ టెండర్ దాఖలు చేసిన
మూడు నిర్మాణ సంస్థలు
ఫ నిర్మాణ వ్యయం పెంచుకునేలా
నిబంధన మార్పు
ఫ టెండర్లు ఖరారయ్యాక
30 నెలల్లో నిర్మించాలని గడువు
టెండర్ ప్రక్రియకు నిబంధనల సడలింపు
యాదాద్రి పవర్ప్లాంట్ వద్ద రెండు వేల క్వార్టర్లతో టౌన్షిప్ నిర్మాణానికి రూ.928.52కోట్ల వ్యయంతో జెన్కో ఆరు నెలల క్రితం టెండర్లు పిలిచింది. పెరిగిన ధరలకు అనుగుణంగా నిర్మాణ వ్యయాన్ని పెంచేందుకు అనుమతించే నిబంధనను చేర్చాలని కాంట్రాక్టర్లంతా ప్రీ బిడ్ సమావేశంలో జెన్కోపై ఒత్తిడి తెచ్చారు. ఈ నిబంధన చేర్చే వరకు టెండర్ వేయమని తేల్చి చెప్పడంతో టెండర్ దాఖలు గడువును జెన్కో తొమ్మిది సార్లు పొడిగిస్తూ వచ్చింది. అయినా కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేయలేదు. వాస్తవానికి ధరల పెంపు నిబంధన గతంలో ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకోని కాంట్రాక్టర్లు ఇష్టారీతిన ధరలు పెంచమని అడుగుతుండడంతో సంస్థపై ఆర్థిక భారం పడుతుందని భావించిన జెన్కో 2009లో ఆ నిబంధనను తొలగించింది. తాజాగా కాంట్రాక్టర్ల డిమాండ్ను జెన్కో ప్రభుత్వానికి నివేదించింది. ధరల పెంపు నిబంధనను చేర్చేందుకు జెన్కోకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 12న ఉత్తర్వులిచ్చింది. అందుకు అనుగుణంగా గత నెల 15న మరోసారి జెన్కో టెండర్లు పిలిచింది. మూడు నిర్మాణ సంస్థలకు చెందిన కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు జెన్కో వర్గాలు తెలిపాయి.