రిజిస్ట్రేషన్లు తగ్గినా ఆదాయం భేష్
ఎల్ఆర్ఎస్తో
ఆదాయం పెరిగింది
నల్లగొండ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరిగింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా గత సంవత్సరం రూ.412 కోట్లు ఆదాయం వస్తే.. ఈ సారి రూ.426 కోట్లకు పెరిగింది. ఎల్ఆర్ఎస్ చెల్లింపుల ద్వారా ఆదాయం పెరిగింది.
– డీఆర్.ప్రకాష్, జిల్లా రిజిస్ట్రార్, నల్లగొండ
ఫ గతేడాదితో పోల్చిత్చే రూ.14 కోట్లు పెరిగిన ఆదాయం
ఫ ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇవ్వడంతో ఆదాయం రాక
నల్లగొండ : రిజిస్ట్రేషన్ల శాఖకు రాష్ట్రమంతటా ఆదాయం తగ్గితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించడంతో చాలా జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయి.. ఆదాయం కూడా తగ్గింది. నల్లగొండ జిల్లాలో మాత్రం రిజిస్ట్రేషన్లు తగ్గినా.. రూ.14 కోట్ల మేర ఆదాయం పెరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,43,420 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా వాటి ద్వారా రూ.412 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక.. 2024–25 సంవత్సరంలో 1,40,845 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా వాటి ద్వారా రూ.426 కోట్లు ఆదాయం సమకూరింది.
ఉమ్మడి జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
నల్లగొండ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించింది. హైడ్రా, ఎఫ్టీఎల్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించింది. దీంతో రిజిస్ట్రేషన్లు తగ్గి చాలా వరకు ఆదాయం పడిపోయింది. అయితే గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరుగుతూ వచ్చింది.


