
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఎస్ఓ
నల్లగొండ : ఫిబ్రవరి –2024లో ప్రభుత్వం నిర్వహించనున్న డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు www. bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసి సంబంధిత సర్టిఫికెట్లు, చలానాను డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, హయ్యర్గ్రేడ్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు పరీక్ష ఫీజును ఈ నెల 29లోగా చెల్లించాలని పేర్కొన్నారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్కు పరీక్ష ఫీజు రూ.100, హయ్యర్ గ్రేడ్కు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్కు రూ.150, హయ్యర్గ్రేడ్కు రూ.200 పరీక్ష ఫీజు ఉంటుందని తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 5లోగా, రూ.75 అపరాధ రుసుంతో వచ్చే నెల 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. లోయర్ గ్రేడ్ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, హయ్యర్కు దరఖాస్తు చేసే వారు లోయర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు.
20 వరకు వరల్డ్ స్కిల్స్ పోటీలకు రిజిస్ట్రేషన్
నల్లగొండ : వరల్డ్ స్కిల్స్ –2024 పోటీల్లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ఈ నెల 20లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరల్డ్ స్కిల్స్ కాంపిటేషన్ –2024 ప్రాన్స్లో నిర్వహిస్తున్నారని.. అందుకు షెడ్యూల్ విడుదలైందని పేర్కొన్నారు. ఈ పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తారని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు 50కి పైగా నైపుణ్యాల్లో పోటీ పడవచ్చని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు స్కిల్ ఇండియా డిజిటల్ www.skillindiadigital.gov.in అనే వెబ్సైట్లో ఈ నెల 20లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : క్రిస్మస్ వేడుక 2023 గౌరవ పురస్కారాలకు అర్హులైన క్రైస్తవ అభ్యర్థుల, సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీస్ సంక్షేమ అధికారి టి.విజేందర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, విశిష్ట వైద్య సేవలు, విద్యాబోధన, రచనా రంగం, ఫైన్ ఆర్ట్స్ థియేటర్, క్రీడా రంగాల్లో 10 సంవత్సరాలు పైబడి సేవలు అందించిన ప్రతిభ చూపిన క్రైస్తవులు, విద్య, వైద్య, సామాజిక సేవా రంగాల్లో 30 సంవత్సరాలు పైబడి సేవలు చేస్తున్న క్రైస్తవ సంస్థలు గౌరవ పురస్కారాలకు అర్హత సాధిస్తాయని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు, సంస్థలు దరఖాస్తు నమూనాను www.tscmfc.in వెబ్సైట్ నుంచి పొందాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 17న సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా మైనార్టీస్ కార్యాలయంలో అందజేయాలని, ఇతర వివరాలకు 94943 45471 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు
వేగవంతం చేయాలి
పెద్దఅడిశర్లపల్లి : కొనుగోలు కేంద్రాలోని ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్రోడ్, ఘనపురం గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 రోజుల్లో ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నాగేశ్వర్రావు, దేవరకొండ డీటీ సీఎస్ శ్రీనివాస్గౌడ్, నల్లగొండ డీటీ లింగస్వామి,సీఈఓ వెంకటేశ్వర్రెడ్డి, ప్రభాకర్ ఉన్నారు.
ఉచిత వినికిడి పరీక్షలు
నల్లగొండ టౌన్ : పట్టణంలోని రెడ్క్రాస్ కాంప్లెక్స్లోని శ్రావ్య స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్లో శని, ఆదివారాలల్లో రెండు రోజుల పాటు ఉచితంగా చెవి పరీక్షలను నిర్వహిస్తామని హియరింగ్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నీలకంఠం రమ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ సిటిజన్స్, రేషన్ కార్డుదారులకు వినికిడి యంత్రాలను రాయితీపై ఇవ్వనున్నామని పేర్కొన్నారు. 99669 40294 నంబర్కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.