కందనూలు: యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ.. వాటిని అరికట్టేందుకు ముందుకు రావాలని అదనపు కలెక్టర్ అమరేందర్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నశా ముక్త్ భారత్ అభియాన్‘ కార్యక్రమంలో భాగంగా జూన్ 17 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత, కుటుంబం, సామాజిక జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి దమయంతి, తదితరులు పాల్గొన్నారు.
జూన్ 30 లోపు ఈ–కేవైసీ పూర్తి చేయాలి
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎల్పీజీ, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీపం పథకం, మహాలక్ష్మి పథకం తదితర సబ్సిడీ పథకాల కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన వినియోగదారులందరూ ఈ నెల 30 లోపు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (బీఏఏ), ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ అమరేందర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సంస్థల సేల్స్ అధికారులు, జిల్లాలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో పెండింగ్లో ఉన్న వినియోగదారులందరితో ప్రక్రియను పూర్తి చేయించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు.


