కందనూలు: వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ అనే అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు అడ్వకేట్ రవితేజ పోలీస్ అధికారులకు పలు అంశాల గురించి వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఇటుక బట్టీలు, రైస్ మిల్లు, బొగ్గు బట్టీలు, వ్యవసాయ క్షేత్రాల్లో పని చేయించేందుకు మహిళలు, పిల్లలను అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లా వ్యాప్తంగా వెట్టిచాకిరీ, అక్రమ కార్మిక రవాణాను అరికట్టేందుకు నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అమాయక, పేద ప్రజల శ్రమను దోపిడీ చేస్తూ, వారిని బానిసలుగా మార్చే ముఠాలు, యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో అక్రమంగా కార్మికులను బంధించి పనిచేయించడం గానీ, చిన్న పిల్లలతో ప్రమాదకర పనులు చేయించడంపై ఎవరి దృష్టికై నా వస్తే వెంటనే జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐ శంకర్, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


