ఏటూరునాగారం: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు అన్నారు. మండల కేంద్రంలో గురువారం రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఇటీవల మరణించిన సారంపల్లి మల్లారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన వాణిజ్య విధానం పేరుతో దేశంలోకి విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 36వ అఖిల భారత మహాసభలు నల్లగొండ జిల్లాలో నవంబర్ 15 నుంచి 18వ రకు జరగనున్నాయని తెలిపారు. ఈ మహాసభల జయప్రదానికి రైతులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకుడు సూడి కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ వెంకటేశ్వర్లు, తుమ్మల వెంకట్రెడ్డి, దావూద్, తీగల ఆదిరెడ్డి, చిట్టెం ఆదినారాయణ పాల్గొన్నారు.
రాష్ట్ర రైతుసంఘం అధ్యక్షుడు
పోతినేని సుదర్శన్రావు


