● బీసీ మహిళలకు ఉచితంగా
రూ.12వేల విలువైన ఆటోమేటిక్ మిషన్లు
● 18 నుంచి 55ఏళ్లలోపు మహిళలు అర్హులు
● వితంతు, ఒంటరి మహిళలకు
ప్రత్యేక ప్రాధాన్యం
● సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు గడువు
కనీస విద్యార్హత ఉండాలి..
ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ లబ్ధి పొందాలంటే మహిళలకు కనీస విద్యార్హత ఉండాలి. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, అర్హత పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను మండల, మున్సిపాలిటీ స్థాయి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయిస్తారు. ఆన్లైన్ చేసిన దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తుదారులు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది.
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గంలో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యాపార అవకాశాలు, వడ్డీలేని రుణాలు, రుణ బీమా పథకం, ఆరోగ్యలక్ష్మి. స్వయం ఉపాధి పథకాలను అందిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని వెనుకబడిన తరగతుల మహిళలకు ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకం ద్వారా మరింత ప్రయోజనం కలుగనుంది. ప్రభుత్వం తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది.
జిల్లాకు రెండు వేల కుట్టుమిషన్లు
ప్రభుత్వం తొలి విడతగా ప్రతీ జిల్లాకు రెండు వేల కుట్టు మిషన్లు వందశాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. జిల్లాలో ములుగు, వెంకటాపురం(ఎం), మంగపేట, ఏటూరునాగారం, గోవిందరావుపేట, మల్లంపల్లి, ఎస్ఎస్ తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే కుట్టుమిషన్ తీసుకోవడానికి మహిళలు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేల వరకు ఉంటుంది. జిల్లాకు 2 వేల వరకు ఆటోమేటిక్ కుట్టుమిషన్లు మహిళలకు అందించనుండడంతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.
వచ్చేనెల 15 వరకు గడువు
జిల్లాలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన 18 నుంచి 55 ఏళ్ల వరకు ఉన్న మహిళలు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మహిళలు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వరకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని వర్తింపజేస్తారు. దరఖాస్తు చేసుకునే మహిళ తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. పేద మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 16,337 మంది వితంతువులు, 1,511 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. అదే విధంగా మేర, మేరు సామాజిక వర్గానికి చెందిన వారికి సైతం ప్రాధాన్యం ఉంటుంది.
మండలం వితంతువులు ఒంటరి
మహిళలు
ఏటూరునాగారం 1,557 173
గోవిందరావుపేట 1,858 100
కన్నాయిగూడెం 551 61
మల్లంపల్లి 852 54
మంగపేట 2,573 258
ములుగు 1,915 126
ములుగు మున్సిపాలిటీ 816 60
ఎస్ఎస్తాడ్వాయి 1,189 132
వెంకటాపురం(ఎం) 2,064 106
వెంకటాపురం(కె) 1,659 262
వాజేడు 1,303 179


