ములుగు: ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని ములుగు పురపాలక సంఘం కమిషనర్ సంపత్, చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ శనివారం విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని ఖాళీ, నివాస స్థలాల్లో చెత్త, వ్యర్థాలు, మురుగునీరు నిల్వ ఉండకుండా యజమానులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చెత్త, మురుగునీరు నిల్వతో దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. పురపాలక సంఘం నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 7 రోజుల్లోగా స్థలాన్ని శుభ్రం చేయాలని పేర్కొన్నారు. గడువులోగా శుభ్రం చేయకపోతే పురపాలక సంఘమే శుభ్రపరిచి అయ్యే ఖర్చును సంబంధిత యజమాని నుంచి రూ.10 వేల వరకు వసూలు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.


