ములుగు రూరల్: యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ ఆరోపించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయమాటలతో గద్దెనెక్కిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ యువశక్తిని నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. నిరుద్యోగ యువత శ్రమ దోపిడీకి గురయ్యే విధంగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేరుకే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని తెలిపారు. రాష్ట్రంలో 20 వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 9వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకట్రెడ్డి, రాజేందర్, చిట్టిబాబు, మల్లారెడ్డి, ప్రవీన్, కవిత, రజిత, రాజు, రవీందర్, అరుణ్, దేవేందర్, రవితేజ, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ


