ములుగు రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)ను ప్రవేశ పెట్టింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఉపకార వేతనం అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువు కొనసాగించేందుకు ఉపకార వేతనం ఎంతగానో దోహదపడుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు దూరంగా కాకుండా ఉండేందుకు ఈ స్కాలర్షిప్ను తీసుకు వచ్చింది.
అర్హతలు
ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. దీంతో పాటు 7వ తరగతిలో 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో దరఖాస్తు పత్రాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలి.
ఆన్లైన్లో పరీక్ష రుసుం చెల్లింపు..
అర్హత పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఓసీ, బీసీ వారు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50లు ఆన్లైన్లో చెల్లించాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు పూర్తిచేయాలి. ఈ నెల 24వ తేదీతో గడువు ముగియనుంది. నవంబర్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించారు.
ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు..
ఎన్ఎంఎంఎస్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు ఉపకారవేతనం అందిస్తారు. ప్రతీ ఏడాది రూ.12 వేలను విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడానికి మంచి అవకాశం ఇది.
విద్యార్థులు వినియోగించుకోవాలి
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో అర్హత సాధిస్తే నాలుగేళ్ల పాటు ఏటా రూ.12వేల స్కాలర్షిప్ అందుతుంది. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి పరీక్షకు దరఖాస్తులు చేసుకునేలా చూడాలని ఆదేశించాం.
– సిద్ధార్థ్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి
దరఖాస్తుకు ఈనెల 24వరకు గడువు
8వ తరగతి విద్యార్థులు అర్హులు
అర్హత సాధిస్తే
ఏటా రూ.12వేలు అందజేత
8వ తరగతి విద్యార్థులు
ములుగు 192
వెంకటాపురం(కె) 171
మంగపేట 168
గోవిందరావుపేట 155
ఏటూరునాగారం 134
వెంకటాపురం(ఎం) 90
తాడ్వాయి 69
వాజేడు 63
మల్లంపల్లి 43
కన్నాయిగూడెం 29
మొత్తం 1,114
గతంలో అర్హత సాధించిన విద్యార్థులు
2022 18
2023 21
2024 18
2025 19


