ములుగు: హైదరాబాద్ తరహాలో జిల్లాను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీతక్క మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. గృహా నిర్మాణానికి సంబంధించి ములుగు నియోజకవర్గానికి 5వేల ఇళ్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. సాగునీటి రంగంలో ప్రాధాన్యత ఇస్తూ రూ.200 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, రామప్ప–లక్నవరం అనుసంధాన పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ పనులు పూర్తయితే వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు, వైద్యవిద్య సదుపాయాల విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి నిధులను విడుదల చేస్తూ నిలిచి పోయిన పనులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిని వనదేవతలు సమ్మక్క–సారలమ్మ చూసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై తప్పు డు ప్రచారం చేయడం సరికాదని, ప్రజలు వాస్తవాలను గమనించాలని మంత్రి సీతక్క కోరారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క


