వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లిలో నిర్మించ తలపెట్టిన 100కేవీ సోలార్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం(బీఈఎస్ఎస్) పనులను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ మేరకు చీకుపల్లిలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బీఈఎస్ఎస్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు పనులకు సంబంధించిన మెటీరియల్ను మూడు రోజు లుగా చేరవేస్తుండటంతో సీఎండి అక్కడికి చేరుకుని పనులపై ఆరా తీశారు. అనంతరం వెంకటాపురం(కె) నుంచి ధర్మవరం వరకు నిర్మిస్తున్న 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ పనులు, చెరుకూరు నుంచి ధర్మవరం వరకు అటవీ ప్రాంతంలో ఉన్న పాత 33 కేవీ లైన్ స్థానంలో కవర్డ్ కండక్టర్తో చేపట్టిన పనులను పరిశీలించారు. వాజేడు సెక్షన్ ఫీల్డ్ సిబ్బంది, ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్ సిబ్బందితో మాట్లాడి పలు వివరాలను తెలుసుకున్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండటంతో పాటు సేఫ్టీ పరికరాలను సక్రమంగా ఉపయోగించాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఈ భిక్షపతి, డీఈలు సదానందం, పురుషోత్తం ఉన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ములుగు: జిల్లా కేంద్రంలో సీఎం పర్యటన ఏర్పాటు పనులను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 16వ తేదీ సీఎం రేవంత్రెడ్డి ములుగు పర్యటనలో భాగంగా విద్యుత్ శాఖకు సంబంధించిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీస్ కాంప్లెక్స్, గట్టమ్మ సబ్స్టేషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎస్ఈ భిక్షపతి, డీఈ సదానందం, ఈఈ వెంకటరాం, ఏడీఈ వేణుగోపాల్, ఏఈలు పాల్గొన్నారు.


