మేడారంలో నిరంతరం పారిశుద్ధ్య పనులు
మేడారం (ములుగు): మేడారం మహాజాతరలో మున్సిపల్, పంచాయతీరాజ్, పారిశుద్ధ్య కార్మికులు 5 వేల మంది నిత్యం అందుబాటులో ఉంటూ రోడ్లు, మరుగుదొడ్లు, చెత్తాచెదారం సేకరిస్తూ నిరంతరం సేవలు అందిస్తున్నారు. జాతరకు 15 రోజుల ముందు నుంచి పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి హెల్త్ శానిటేషన్ వర్కర్లతో పనిచేయిస్తూ రోజువారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. అమ్మవారి గద్దెల ప్రాంగణం, ఇతర కార్యాలయాలు, అధికారుల నివాస ప్రాంతాలు, రహదారుల వెంబడి, మరుగుదొడ్ల పరిశుభ్రత, క్లీనింగ్, బ్లీచింగ్ వంటి శానిటేషన్ పనులు నిర్వహిస్తూ భక్తులకు హెల్త్ సమస్యలు రాకుండా చూస్తున్నారు. సేకరించిన చెత్తాచెదారాన్ని ప్రత్యేక ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, తదితర వాహనాల్లో బయటకు తరలిస్తున్నారు. రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చిన కాంట్రాక్టర్ రూ.700 మాత్రమే చెల్లిస్తున్నాడని కార్మికులు వాపోతున్నారు. తాగునీటితో పాటు తినడానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. మాస్క్లు, చీపుర్లు సైతం కాంట్రాక్టర్ అందించడంలేదని గుంటూరు నుంచి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


