అమ్మల దీవెన
పులకించిన జంపన్నవాగు
– 8లోu
మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం):
వరాల తల్లులకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించారు. నలుగురు దేవతలు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం గద్దెలకు చేరుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేరడంతో మొక్కులు అప్పగించారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె, యాటపోతులు, కోళ్లు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం కళకళలాడింది. గ్రిల్స్ బయట నుంచి అమ్మవార్లను తనివితీరా మొక్కుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. జయజయధ్వానాలతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. ఆదివాసీ సంప్రదాయంగా జరిగిన పూజలు, డోలు వాయిద్యాలతో మేడారం ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది.
కోటి మందికిపైగా మొక్కులు..
వనదేవతలను ఇప్పటి వరకు కోటి మందికిపైగా.. దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు సుమారు 45 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, మంగళవారం నుంచి మొదలైన భక్తుల రద్దీ శుక్రవారం వరకు కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. మేడారం పరిసరాల ప్రాంతంలోని 20 కిలోమీటర్ల దూరంలో విడిది చేసిన భక్తులు అమ్మవార్లు గద్దెలపైకి రావడంతో బుధవారం రాత్రి నుంచి లక్షల సంఖ్యలో దర్శనానికి పోటెత్తారు. మేడారం ఎక్కడ చూసినా భక్త జన గుడారంలా కనిపించింది. అటవీ ప్రాంతంలోని వనంలో భక్తులు చెట్ల కింద గుడారాలు వేసుకుని మూడు రోజులు సందడిగా గడిపారు.
సమీప గ్రామాల్లో భక్తుల సందడి
మహా జాతర సందర్భంగా మేడారంతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్, కాల్వపల్లి, బయ్యక్కపేట, వెంగళాపూర్ గ్రామాల్లో సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో గదులను అద్దెకు తీసుకుని విడిది చేశారు. పండుగ వాతావరణంలో పల్లెలన్నీ కళకళలాడాయి. ఇంటి యజమానులు భక్తులను బంధువులుగా ఆదరించారు. బస చేసింది మూడు రోజులే అయినప్పటికీ వారిలో కొందరు బంధువులుగా మారిపోయారు.
తిరుగు ప్రయాణం..
తల్లుల దర్శనం అనంతరం శుక్రవారం భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో వేలాది మంది తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఆర్టీసీ బస్టాండ్ భక్తులతో కిక్కిరిసిపోయింది. మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆర్టీసీ బస్సుల రాకపోకలతో బారులుదీరాయి. సాధారణంగా 20 నిమిషాల్లో తాడ్వాయికి చేరుకోవాల్సి ఉండగా.. ఆర్టీసీ బస్సులు బారులుదీరడంతో గంటకు పైగా సమయం పట్టింది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు సైతం గుడారాలు ఖాళీ చేసి తిరుగు ప్రయాణం కావడంతో పస్రా వరకు ప్రైవేట్ వాహనాలతో దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి.
భక్త కోటి జనంతో పూజలు అందుకున్న సమ్మక్క–సారలమ్మను నేడు (శనివారం) సమ్మక్క సారలమ్మ పూజారులు వన ప్రవేశం చేయనున్నారు. అదేవిధంగా ఏటూరునాగారం మండలంలోని కొండాయికి గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్లకు పగిడిద్దరాజు పడిగలను గద్దెలపై నుంచి పూజారులు తీసుకెళ్లనున్నారు. సారలమ్మతో పాటు గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెల వద్ద నుంచి ముందు బయల్దేరగా, వీరి తర్వాత సమ్మక్కను పూజారులు వన ప్రవేశం చేయించనున్నారు.
సంపెంగలో నీళ్లు సంబురపడ్డాయి..
పూనకాలతో పులకించి పోయాయి.
తలనీలాలు తన్మయత్వం చెందాయి..
ఎనలేని భక్తిని చాటాయి.
పసుపు, కుంకుమలు ప్రణమిల్లాయి..
పొడిసేటి పొద్దులై ప్రభవించాయి.
కోళ్లు, యాటలు సై సై అన్నాయి..
మొక్కుల లెక్కల్లో తరించిపోయాయి.
సాక చుక్కలు నేలపై పారాయి..
ఆనవాయితీకి అద్దం పట్టాయి.
ఎత్తు బంగారపు మూటలు నెత్తిన చేరాయి..
భక్తి నిండిన మనసుల్ని ఉరకలెత్తించాయి.
ఒడిబియ్యం, చీర సారెలు పోటీపడ్డాయి..
వనదేవతల ఒడికి వడివడిగా చేరాయి.
గద్దెలు పసిడి కాంతులై ధగధగ మెరిశాయి..
భక్తకోటికి ఆడబిడ్డల దీవెనలు అందాయి.
మేడారం (కాళేశ్వరం): మేడారం జాతరకు లక్షలాదిగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి పునీతులయ్యారు. వాగులో ఇసుకతో తల్లుల ప్రతిమలు చేసి పూజించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. శివసత్తులు పూనకా లతో నీరాజనం పలికారు. వరం పట్టారు. భ క్తులతో జంపన్నవాగు ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
మేడారంలో కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం
వనదేవతలను లక్షలాదిగా దర్శించుకుని పూజలు
తిరుగు ప్రయాణంలో వాహనాల బారులు
అమ్మల దీవెన
అమ్మల దీవెన


