
వసతులు అంతంతే!
జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో సౌకర్యాల లేమి
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ(నేషనల్ మెడికల్ కమిషన్) అడ్డంకులు తెలిపింది. ఈ మేర కు మెడికల్ కళాశాలలో నిబంధనల మేరకు వైద్య విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలో అరకొర వసతుల మధ్య వైద్య విద్య కొనసాగిస్తున్నారు. వైద్య విద్యార్థులకు ల్యాబ్లు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అనుసంధాన ఆస్పత్రి, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉంచాలి. ఈ వసతుల కొరతను గుర్తించిన నేషనల్ మెడికల్ కమిషన్ సీరియస్ అయ్యింది. ఉమ్మడి జిల్లాలోని పలు వైద్య కళాశాలలతో పాటు ములుగు కళాశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ప్రవేశాల లోపు కళాశాలలో ఎన్ఎంసీ నిబంధనల మేరకు వసతులు కల్పిస్తేనే ప్రవేశాలకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు షోకాజ్ నోటీసులపై సంజాయిషీ ఇచ్చేందుకు బుధవారం ఢిల్లీకి ఆయా కళాశాలల ప్రిన్సిపా ల్స్, డీన్స్ వెళ్లనున్నారు.. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల భవితవ్యం నేడు (బుధవారం)తేలనుంది.
ఏర్పాట్లలో నిమగ్నం
మెడికల్ కళాశాలలో నిబంధనల మేరకు ఏర్పాట్లు, తగిన వసతులు కల్పించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది అడ్మిషన్లకు సుమారు 2 నెలల సమయం ఉండడంతో నిబంధనల మేరకు కళాశాలలో వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లకు అనుమతి పొందేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.
నేడు తేలనున్న భవితవ్యం..
ప్రభుత్వ వైద్య కళాశాల భవితవ్యం నేడు (బుధవారం)తేలనుంది. గుర్తించిన లోపాలు, షోకాజ్ నోటీసులపై సంజాయిషీ ఇవ్వాలని, ఇందుకోసం బుధవారం ఢిల్లీకి రావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈలను ఆదేశించింది. ఆ లోపాలను సరిచేస్తామని అన్ని కళాశాలలనుంచి హామీ పత్రాలు ఇవ్వనున్నారు. కానీ, వాటికి కూడా సంతృప్తి చెందక సీట్లు తగ్గిస్తారా? జరిమానాలు విధిస్తారా..? మందలించి వదిలేస్తారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో పూర్తి వివరాలు సమర్పించేందుకు అన్ని జిల్లాల, మెడికల్ కళాశాలల డీన్స్/ప్రిన్సిపాళ్లు, మెడికల్ సూపరింటెండెంట్లతో డీఎంఈ సోమవారం, మంగళవారంలలో సమావేశమై కళాశాలల సమగ్ర సమాచారం సేకరించారు.
ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి
ఎన్ఎంసీ కొర్రీలు
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
వసతులు కల్పిస్తేనే
ప్రవేశాలకు అనుమతి వచ్చే అవకాశం
అధ్యాపకుల అవసరం ఉంది..
జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో అధ్యాపకుల అవసరం ఉంది. ప్రస్తుతం కళాశాల, హాస్పిటల్లో మొత్తం 75 మంది అధ్యాపకులు ఉన్నారు. మరో 25మంది అవసరం ఉంది. మెడికల్ బోర్డుకు నివేదికలు అందించాం. కళాశాలలో విద్యార్థుల ప్రాక్టికల్స్కు మృతదేహాలు అందుబాటులో లేవు. అందుకు కాకతీయ మెడికల్ కళాశాల నుంచి తెప్పించడంతో పాటు పోలీసులను ఆశ్రయించాం. ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం కళాశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారు.
– మోహన్లాల్, ప్రిన్సిపాల్, వైద్య కళాశాల

వసతులు అంతంతే!