
పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం
ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని బాల్య వివాహ నిరోధక అధికారిణి, సీడీపీఓ ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగము ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులకు బాల్యవివాహాల నిషేధ చట్టం – 2006 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగము అధికారి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆధునిక సమాజంలో ఇప్పటికీ బాల్య వివాహాలు సవాల్గా మారాయన్నారు. మారుమూల ప్రాంతాల్లో వివిధ కారణాలతో బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ స్థాయిలో బాల్యవివాహ నిరోధక అధికారులుగా పంచాయతీ కార్యదర్శులు వ్యవహరించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహాల నిర్మూలనలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. బాల్య వివాహ రహిత జిల్లాగా ములుగును మార్చడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీఓ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైన బాల్య వివాహాలు జరిగితే వెంటనే ఆ ప్రదేశాన్ని సందర్శించి ఆపాలన్నారు. బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం –2006 ప్రకారం 18 ఏళ్లు నిండని అమ్మాయిలు, 21ఏళ్లు నిండని అబ్బాయిలకు వివాహం చేయడం చటరీత్యా నేరమన్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా ఉంటుందన్నారు. బాల్య వివాహాలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ 1098, 112లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీవిద్య, కార్యదర్శులు పాల్గొన్నారు.
సీడీపీఓ ప్రేమలత