
నేర రహిత సమాజ నిర్మాణానికి కృషి
ములుగు రూరల్: నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ అన్నారు. మండల పరిధిలోని జాకారం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన అభయ మిత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల భద్రత, భరోసాకు అభయ మిత్ర కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిడం వల్ల నేర రహిత సమాజ నిర్మాణం, పోలీసులకు, ప్రజలకు సత్సంబంధాలు పెంపొందుతాయన్నారు. నిషేధిత మాదకద్రవ్యాల వ్యతిరేఖ చట్టాలపై అవగాహన కల్పించారు. యు వత మాదక ద్రవ్యాలకు అలవాటుపడి జీవితం నాశనం చేసుకోవద్దన్నారు. తల్లితండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని సూచించారు. గంజాయి, నకిలీ విత్తనాల అమ్మకాలపై సమాచారం అందించిన వారికి రూ.10 వేలు నగదు బహుమతి అందిస్తామన్నారు. మండల పరిధిలోని 32 పంచాయతీల్లో యాంటీ డ్రగ్ కమిటీలను నియమించినట్లు తెలిపారు. రైతులు అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు కరెంట్ ఫినిసింగ్ వేయకూడదని సూచించారు. యువత పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలతో ప్రేమ, శారీరక సంబంధాలు పెట్టుకోవడం నేరమని వివరించారు. సైబర్ క్రైం నేరస్తుల బారిన పడకుండా అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్లు, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు, యాంటీ డ్రగ్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
ఎస్పీ శబరీశ్