
పెట్టుబడి సాయం..
రూ.48.47 కోట్లు
రైతుల ఖాతాల్లో జమ
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 85,990 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తుండగా రైతు భరోసా పథకం కింద సుమారు రూ.103 కోట్లు ప్రభుత్వం అందించనుంది. సోమవారం రెండు ఎకరాలలోపు ఉన్న 49,356 మంది రైతులకు వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం రూ.30,10 కోట్లు రైతు ఖాతాల్లో జమ అయ్యాయి. మంగళవారం మూడున్నర ఎకరాలలోపు ఉన్న 12,310 మంది రైతులకు రూ.18.37 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఈ రెండు రోజుల్లో మూడున్నర ఎకరాలలోపు ఉన్న 61,666 మంది రైతులకు రూ.48.47 కోట్లను ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు విడతల వారీగా రైతులందరికీ రైతుభరోసా డబ్బులను ప్రభుత్వం అందజేయనుంది. జూన్ 5వ తేదీలోపు పాస్పుస్తకాలు కలిగిన ప్రతీ రైతుకు రైతు భరోసా వర్తింపజేస్తామని అధికారులు వెల్లడించారు.
వెంకటాపురం(ఎం): వానాకాలం సాగు ప్రారంభంలోనే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండడంతో కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా సాగు సమయానికే డబ్బులు అందుతుండడంతో రైతులు సంబరపడిపోతున్నారు. ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన ప్రతీ ఒక్కరికి పెట్టుబడి సాయం అందనుంది. సోమవారం రెండెకరాలలోపు, మంగళవారం మూడున్నర ఎకరాలలోపు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం ఎకరానికి రూ.6వేల చొప్పున డబ్బులు జమ చేసింది. ప్రతిఏటా ఎకరానికి రూ.12వేల చొప్పున రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పంటల సాగును ప్రోత్సహిస్తోంది.
ఏడాదికి రూ.12వేలు..
రైతులు సాగు చేస్తున్న పంటలకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదటిసారిగా 2018 యాసంగి సీజన్కు ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించింది. 2019లో తిరిగి రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎకరానికి రూ. 5వేల చొప్పున రెండు పంటలకు పెట్టుబడి సాయాన్ని పెంచి రూ.10 వేలు అందించింది. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఏడాదికి రూ.12వేలకు పెంచి అన్నదాతకు భరోసా కల్పించింది.
మండలాల వారీగా ఖాతాల్లో జమ అయిన నిధులు
మండలం రైతులు నిధులు
ఏటూరునాగారం 5,344 4,11,42,084
గోవిందరావుపేట 5,146 4,48,05,368
కన్నాయిగూడెం 3,794 2,72,73,687
మంగపేట 6,809 6,27,57,450
ఎస్ఎస్తాడ్వాయి 4,946 4,22,88,890
వెంకటాపురం(కె) 6,176 4,66,01,333
వాజేడు 6,710 4,80,29,756
ములుగు 14,098 10,53,70,686
వెంకటాపురం(ఎం) 8,643 6,64,50,876
రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
రైతుల ఖాతాల్లో జమ అవుతున్న డబ్బులు
జిల్లాలో 61,666 మందికి
రూ.48.47 కోట్ల సాయం
ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు