
జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: నిరుద్యోగ యువత రేపు(19న) జిల్లాకేంద్రంలోని టాస్క్ రీజినల్ సెంటర్లో నిర్వహిస్తున్న జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. టాస్క్ రీజినల్ సెంటర్లో నైపుణ్య శిక్షణ పొందిన టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ పొందిన టెన్త్, ఇంటర్, డిప్లమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన నిరుద్యోగ యువత ములుగు, వరంగల్, హైదరాబాద్లోని సాబిక్ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్, టాటా స్ట్రీవ్, జస్ట్డియల్, జహ్నావి కమ్యూనికేషన్, హెచ్బీడీ ఫైనాన్స్, షణ్ముక బయో ఆర్గానిక్స్, ముథూట్ మైక్రోఫిన్ లిమిటెడ్, శ్రీరాం ఫైనాన్స్తో పాటు ఇతర కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని టాస్క్ రీజినల్ సెంటర్లో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు టాస్క్ రీజినల్ కో ఆర్డీనేటర్ సెల్ నంబర్ 9618449360లో సంప్రదించాలని తెలిపారు.
సమ్మె నోటీస్ అందజేత
ములుగు రూరల్: జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం అంగన్వాడీలతో కలిసి జిల్లా కార్యాలయ అధికారి రాజ్కుమార్, జిల్లా ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ తుల రవికి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో తీసుకు వచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవని తెలిపారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఐసీడీఎస్ లాంటి కేంద్ర ప్రభుత్వ స్కీములను ప్రభుత్వ శాఖలుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క, భవాని, సునీత, సుమంజలి తదితరులు పాల్గొన్నారు.
పోల్టాక్స్
రద్దుచేయాలని వినతి
భూపాలపల్లి అర్బన్: కేబుల్ ఆపరేటర్లపై ప్రభుత్వం విధిస్తున్న పోల్ టాక్స్ను రద్దుచేయాలని కోరుతూ కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వేశాల రమేష్బాబు మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పనిచేస్తున్నారని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించి టాక్స్ రద్దుచేయాలని కోరారు.
మైనర్లతో వాహనాలు
నడిపిస్తే చర్యలు
కాటారం: మైనర్లకు వాహనాలు ఇచ్చి పనులు చేయిస్తే సదరు వాహన యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు. కాటారం మండలం మేడిపల్లి పరిధిలోని బస్వాపూర్కు చెందిన బాలుడు మంగళవారం ట్రాక్టర్తో పని చేస్తుండగా పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్ యజమాని వెన్నపురెడ్డి సమ్మయ్య, ట్రాక్టర్పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి డ్రైవింగ్ చేయించడం, పనులు చేయించడం నేరమన్నారు. అలాంటి వారిని ఉపేక్షించబోమని పేర్కొన్నారు. మైనర్లతో పనులు చేయిస్తే బాలకార్మిక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని డీఎస్పీ హెచ్చరించారు. వాహనాల యజమానులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.
లక్ష్మారెడ్డి పల్లెలో
వింత పాము
గణపురం: మండలంలోని లక్ష్మారెడ్డిపల్లెలో మంగళవారం సాయంత్రం వింత విషపాము దర్శనమిచ్చింది. లక్ష్మారెడ్డిపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో రోడ్డుపై రెండు తలలతో ఎరుపు రంగుతో నల్లని కట్లతో గ్రామస్తులకు పాము కనిపించింది. కొందరు రక్త పింజర అని.. కాటు వేస్తే చాలా ప్రమాదమని అంటుండగా, మరికొందరు మాత్రం ఇది ఇప్పటివరకు చూడని పాము అని చర్చించుకుంటున్నారు.

జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి