
జీసీసీ సేవలను విస్తృతం చేయాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన సహకార సంఘం పరిధిలో గల ప్రజలకు అందుతున్న సేవలను మరింత విస్తృత పర్చాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జీసీసీ అధికారుల సమావేశంలో పీఓ మాట్లాడారు. జీసీసీ వాహనాల మరమ్మతులు ఇప్పటి వరకు ఎన్ని చేయించారని, ఇంకా ఎన్ని చేయించాల్సి ఉందని ఆరా తీశారు. మహదేవ్పూర్ సొసైటీకి చెందిన గ్యాస్గోదాం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీఆర్ డిపోలు, ఎంఎల్ఎస్ పాయింట్ల గోదాంలు, పెట్రోల్ బంక్ల తనిఖీలను మరింత ముమ్మరం చేయాలన్నారు. డీఆర్ డిపోల నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, లాభాలపై చర్చించారు. జీసీసీ గోదాంలు, ఆఫీసులు, డీఆర్ డిపోల స్థలాలను తనిఖీ చేసి గుర్తించాలన్నారు. ఆహార సదుపాయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సకాలంలో డీఆర్ డిపోలు, హాస్టళ్లలకు సరఫరా అయ్యేలా చూడాలని, ఆహారం నిల్వలు గడువు ముగిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏటూరునాగారం డివిజన్ పరిధిలో పనిచేసే పెట్రోల్ బంక్లు దగ్గర తప్పకుండా సౌండ్బాక్సుల స్కానర్లను అమర్చాలన్నారు. బంక్లు, గోదాంల వద్ద బోరు సదుపాయం లేకపోతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డీఎం వాణి, మేనేజర్లు దేవ్, స్వామి, డీఈఓఎస్ అన్వర్, ప్రసాద్ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా