
ప్రారంభ దశలోనే కరకట్ట నిర్మాణ పనులు
సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
మంగపేట: వర్షాకాలం ప్రారంభం కావడంతో ఏజెన్సీలోని గోదావరి పరీవాహక ప్రాంతమైన మండల పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. 2022 జూలైలో గోదావరి జల ప్రళయం సృష్టించిన బీభత్సాన్ని తలుచుకుని మండలంలోని గోదావరి ఒడ్డువెంట ఉన్న కమలాపురం, మండల కేంద్రంలోని పొదుమూరు, సినిమాహాల్ వీధి, వాడగూడెం, కత్తిగూడెం, దేవనగరం, అకినేపల్లి మల్లారం తదితర లోతట్టు ప్రాంతాల్లోని గోదావరి వరద ముప్పు ప్రాంతాల ప్రజలు వణికి పోతున్నారు. ఈ సారైనా కరకట్ట పనులు పూరై వరద ముప్పు తప్పేనా అని చర్చించుకుంటున్నారు.
2008లో నాబార్డు నిధులు మంజూరు
మండల పరిధిలోని కమలాపురం నుంచి మంగపేట వరకు గోదావరి ఒడ్డు వెంట 5.5 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణానికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్యాకేజీ వర్క్ కింద రూ.5,77,40,450 నాబార్డు నిధులను మంజూరు చేశారు. టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న గుత్తేదారు దొంగల ఒర్రె వద్ద నుంచి పొదుమూరు పుష్కరఘాట్ వరకు కరకట్ట నిర్మించకుండా వదిలేయడంతో ప్రతిఏటా వర్షాకాలంలో గోదావరి ఒడ్డు వరద కోతకు గురై ఒడ్డు వెంట ఉన్న కోట్లాది రూపాయల విలువైన నల్లరేగడి భూములు ప్రతిఏటా గోదావరిలో కలిసిపోతున్న విషయం తెలిసిందే. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కరకట్ట నిర్మాణానికి గోదావరి తీరం వెంట సందర్శనలు, హామీలు, అంచనాలు, నిధుల మంజూరు, భూ సర్వేలతోనే సరిపెట్టింది. స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితో ఎట్టకేలకు 2022లో మండల కేంద్రంలోని దొంగలఒర్రె వద్ద నుంచి పుష్కరఘాట్ వరకు 2.5 కిలో మీటర్ల కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం రూ.54 కోట్లు్, భూసేకరణకు రూ.1.50 కోట్లు నిధులను మంజూరు చేసింది. గోదావరి ఒడ్డు నుంచి సుమారు 34 మీటర్ల వెడల్పు, రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు 25 ఎకరాల భూసేకరణకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో 2022 జూలైలో వచ్చిన వరదలను అరికట్టే విధంగా కరకట్ట నిర్మాణానికి రీడిజైనింగ్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులు నిలిచిపోయాయి.
2022లో ఉప్పొంగి ప్రవహించిన గోదావరి
కరకట్ట నిర్మాణం చేపట్టకపోడంతో 2022 జూలైలో భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహించింది. గోదావరి వరద నీటికి వాగులు వంకలు వరద పోటెత్తడంతో మండల పరిధిలోని కమలాపురం(పాతూరు), పొదుమూరు, ముస్లింవాడ, సినిమాహాల్వీధి, చుంచుపల్లి, వాడగూడెం, కత్తిగూడెం, దేవనగరం, అకినేపల్లిమల్లారంలో తదితర లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. పలు గ్రామాల్లో మూడు నుంచి ఐదు మీటర్ల ఎత్తులో వరదనీరు వచ్చి చేరడంతో స్థానికులు సామగ్రిని సద్దుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కొద్ది రోజులు పాటు తలదాచుకున్నారు. ఈ క్రమంలో ఇళ్లలోని విలువైన వస్తువులు పాడైపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుండడంతో ఈసారి కూడా వరద ముప్పు తప్పదేమో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
లాంచింగ్ యాప్రాన్ విత్ క్రేడ్స్ టెక్నాలజీతో పనులు
సీడీఓ హైదరాబాద్ వారి నుంచి కరకట్ట నిర్మాణం పనుల డ్రాయింగ్ ఇటీవల రావడంతో పనులను ప్రారంభించాం. ప్రస్తుతం దొంగల ఒర్రె ప్రాంతం నుంచి లాంచింగ్ ఆప్రాన్ విత్ క్రేడ్స్ టెక్నాలజీతో పనులను ప్రారంభించాం. 34 మీటర్ల వెడల్పు, 1.2 మీటర్ల తిక్నెస్తో లాంచింగ్ ఆప్రాన్, ఒడ్డు వెంట 50 మీటర్ల స్లోబ్తో 0.9 మీటర్ల తిక్నెస్తో 2.5 కిలో మీటర్ల వరకు కరకట్ట నిర్మాణం పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం ప్రారంభ దశలోనే పనులు ఉన్నాయి.
– వలీమ్ మహ్మద్, ఇరిగేషన్ ఏఈ మంగపేట
న్యూస్రీల్
రెండేళ్లుగా ముందుకు సాగని వైనం
వర్షాకాలం ప్రారంభంతో ముప్పుప్రాంత ప్రజల్లో ఆందోళన
రెండేళ్లుగా ప్రారంభ దశలోనే..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో కరకట్ట నిర్మాణ పనుల టెండరు దక్కించుకుని ప్రభుత్వంతో అగ్రిమెంటు కుదుర్చుకున్న హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం 2024 ఏప్రిల్లో సాయల్ టెస్టింగ్ పనులను ప్రారంభించింది. జూన్ వరకు ఒడ్డు వెంట కరకట్ట నిర్మాణానికి స్లోబ్ లెవలింగ్ పనులను కొనసాగించారు. అనంతరం వర్షాలు, కరకట్ట నిర్మాణ డ్రాయింగ్ రాకపోవడం కారణంగా పనులు నిలిచిపోయాయి. నెల రోజుల క్రితం నుంచి తిరిగి కరకట్ట నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం సమీపించడంతో గోదావరిలో వరద నీరు వచ్చి చేరే ప్రమాదం ఉండడంతో నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయే అవకాశం ఉంది.

ప్రారంభ దశలోనే కరకట్ట నిర్మాణ పనులు

ప్రారంభ దశలోనే కరకట్ట నిర్మాణ పనులు

ప్రారంభ దశలోనే కరకట్ట నిర్మాణ పనులు

ప్రారంభ దశలోనే కరకట్ట నిర్మాణ పనులు

ప్రారంభ దశలోనే కరకట్ట నిర్మాణ పనులు