
వినతులు 88
ప్రజావాణిలో 63, గిరిజన దర్బార్లో 25 ఫిర్యాదులు
ములుగురూరల్/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 88దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ దివా కర, ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా వినతులు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో 63 ఫిర్యాదులు రాగా కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి స్వీకరించారు. అదే విధంగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 25 వినతులు రాగా పీఓ చిత్రామిశ్రా స్వీకరించారు. మొత్తంగా 88 వినతులను పరిశీలించిన అధికారులు ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
గిరిజన దర్బార్కు వచ్చిన వినతులు..
ఏటూరునాగారం మండలం లంబాడీతండా నుంచి ఈఎస్ఎస్ పథకం ద్వారా రుణం మంజూరు చేయాలని విన్నవించారు. ఎస్ఎస్తాడ్వాయి మండలం కౌశెట్టివాయి నుంచి పోడు భూమిలో వ్యవసాయం చేస్తుంటే అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నాగారం గ్రామంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలో మార్పులు చేయాలని విన్నవించారు. నెల్లికుదురు మండలం పంతులు తండా, శ్రీరామగిరి గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు ఉద్యోగం ఇప్పించాలని కోరారు. వరంగల్ గిరిజన గురుకుల కాలేజ్ ఆఫ్ ఎక్సెలెన్స్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పించాలని నిరుద్యోగ యువకుడు విన్నవించారు. మంగపేట మండలం నర్సింహసాగర్ వీఎస్ఎస్ అటవీశాఖ ద్వారా కార్పొరేషన్ సంస్థలో వేసిన జామాయిల్ తోటలోని కర్రను విక్రయించేందుకు పెసా గ్రామసభ ద్వారా తీర్మాణం చేసిన తర్వాతనే విక్రయాలు జరపాలని గిరిజనులు కోరారు. ఏటూరునాగారం చెల్పాక ఏయూపీఎస్లో సోషల్ సీఆర్టీగా ఇప్పించాలని నిరుద్యోగ గిరిజనుడు కోరారు. ఇలా పలువురు తమ తమ సమస్యలపై పీఓకు వినతులు వెల్లడించారు.
ప్రజావాణి దరఖాస్తుల వివరాలు
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు 30
భూ సమస్యలు 17
ఉపాధి కల్పనకు 06
ఇతర సమస్యలు 10
ఇందిరమ్మ ఇళ్లు కావాలి..
గడ్డిగుడిసెలో జీవిస్తున్నాం. సరైన ఇళ్లు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. వర్షాలు పడితే ఇంటిలో ఒక్క చోట నీరు పడని ప్రాంతం లేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నాయకులను కోరినా పట్టించుకోవడం లేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలి.
– కోరం రామక్క, సమ్మక్క, చుంచుపల్లి, మంగపేట
స్వీకరించిన కలెక్టర్ దివాకర,
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
సమస్యలు ఆలకించి..
సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు

వినతులు 88

వినతులు 88