
ముగిసిన బీరమయ్య జాతర
వాజేడు: గత మూడు రోజులుగా కోలాహలంగా సాగిన బీరమయ్య జాతర సోమవారంతో ముగిసింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని లొట్టిపిట్ట గండి వద్ద జాతరను గిరిజనులు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి లొట్టిపిట్ట గండి గుట్టపైకి సారలమ్మ, ముత్యాలమ్మ, పోషమ్మ, లక్ష్మీదేవరలను చేర్చడంతో ప్రారంభమైంది. జాతర తంతు ఆదివారం బీరమయ్య, రేఖలమ్మలకు కల్యాణం జరిపించడంతో కోలాహలంగా మారింది. మూడు రోజుల పాటు స్వామివారి సన్నిధిలో ఉన్న భక్తులు దేవుడికి మొక్కులు సమర్పించుకుని ఒక్కొక్కరుగా సోమవారం ఇంటి దారి పట్టారు. బీరమయ్య నామస్మరణతో మారుమోగిన లొట్టిపిట్ట గండి ప్రాంతం ఒక్క సారిగా నిర్మానుష్యంగా మారింది. సల్లంగా ఉంటే మళ్లీ వస్తామంటూ భక్తులు తిరుగు ప్రయాణం అయ్యారు. దేవర్లను సాంప్రదాయం ప్రకారం పూజారులు కడేకల్, పెద గంగారం, టేకుల గూడెం గ్రామాలకు పంపించారు. ఈ నెల 21న రేఖులమ్మ జాతరను మండల పరిధిలోని అయ్యవారిపేటలో నిర్వహించనున్నారు.