
అంబేడ్కర్ కీర్తి ప్రతిష్టలను ప్రజలకు వివరించాలి
● మాజీ ఎంపీ సీతారాంనాయక్
ములుగు రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కీర్తి ప్రతిష్టలను ప్రజలకు వివరించాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం పార్టీ జిల్లా కన్వీనర్ కొత్త సురేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేపు అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి 25వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంబేడ్కర్ జయంతి రోజున జిల్లా కేంద్రంలో 500బైక్లతో ర్యాలీ నిర్వహించాలన్నారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిఒక్కరూ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బలరాం, జవహర్లాల్, రవీందర్రెడ్డి, కృష్ణాకర్, రవిరెడ్డి, నాగరాజు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం కృషితోనే రామప్పకు గుర్తింపు
వెంకటాపురం(ఎం):కేంద్ర ప్రభుత్వం కృషితోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని మహబుబ్బాద్ మాజీ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆనంతరం రామప్ప ఆలయ ఆవరణలోని చెత్తాచెదారాన్ని బీజేపీ నాయకులతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడానికి పార్లమెంటులో రామప్ప ఆలయ చరిత్రను తెలియజేసి పలుమార్లు మాట్లాడినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పాలంపేటలో మండలాధ్యక్షుడు పైడాకుల మల్లేష్ అధ్యక్షతన బూత్ పదాదికారులతో సమావేశం నిర్వహించగా మాజీ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు.