ములుగు రూరల్: ఎంటీబీ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు రాష్ట్ర టీంకు కోచ్, మేనేజర్గా ములుగు మండల పరిధిలోని మదనపల్లి గ్రామానికి చెందిన చిలపాక ఆనంద్ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 28నుంచి 31వ తేదీ వరకు హర్యానాలో జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. అండర్ 16, 18 విభాగాలలో సైక్లింగ్, ఎంటీఎం జాతీయ స్థాయి మౌంటేన్ బైక్ 2024–25 పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరుపున క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు.
చోరీ కేసులను
ఛేదించిన పోలీసులు
ములుగు/ములుగు రూరల్ : ఈ నెల 15న రాత్రి గట్టమ్మ ఆలయం రూ. 52వేల నగదు, వెండి, ఇత్తడి వస్తువులు, 21న మల్లంపల్లిలోని మహంకాళి వైన్స్లో జరిగిన రూ. 24వేల చోరీ కేసులను ము లుగు ఎస్సై వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఛేదించారు. ఈ మేరకు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్సై కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ముంజల విష్ణు, కోడి నాగమణిలు 15న మేడారం వెళ్లి తిరుగుప్రయాణంలో గట్టమ్మ ఆలయం వద్ద ఆగారు. అమ్మవారి హుండీపై, విలువైన నగలపై కన్నేసి దొంగిలించారు. ఈ విషయంలో ఆలయ పూజారి కొత్త సదయ్య ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించి దొంగిలించిన వస్తువులను రికవరీ చేశారు. వైన్స్లో చెన్నూరుకు చెందిన చింతకింది సతీశ్ తాళం పగులగొట్టి నగదును దొంగిలించాడు. షాపు యజమాని ఫిర్యాదు తో కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి సొమ్మును రికవరీ చేసినట్లు వివరించారు.
27నుంచి గిరిజన ఇసుక సొసైటీల గ్రామసభలు
మంగపేట : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని గోదావరిలో గిరిజన ఇసుక లేబర్ సొసైటీల్లో పెసా నిబంధనల మేరకు మెజారిటీ సొసైటీలను ఎంపిక చేసేందుకు ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు ఈనెల 27, 28, 29 తేదీల్లో గ్రామ సభలను నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ బానోత్ భద్రు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న మల్లూరుపరిధిలోని రెండింటికి ఉదయం 10గంటలకు, 28న కత్తిగూడెంలో మూడో ఇసుక క్వారీ సొసైటీలకు ఉదయం 9గంటలకు, రమణక్కపేటలోని గొల్లగూడెం రెండో సొసైటీకి ఉదయం 9గంటలకు, 29న చుంచుపల్లిలో 12గంటలకు, వాడగూడెంలో రెండు సొసైటీలకు 9గంటలకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సొసైటీల ఎంపికకు రెండు రోజుల ముందు గ్రామాల్లో టాంటాం వేయించి గ్రామ సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జీపీల అధికారులను ఆయన ఆదేశించారు.