నటుడు, తమిళ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం జన నాయకన్. పూజాహెగ్డే కథానాయకిగా నటించిన చిత్రంలో మమతా బైజు కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని గత జనవరి 9న తెరపైకి రావాల్సి ఉంది. అయితే సెన్సార్ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జననాయకన్ విడుదలవుతుందని అందరూ ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రం ఇటీవల పూర్తిగా ఇంటర్నెట్లో లీకై యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే.
చిత్ర నిర్మాత ఫిర్యాదు మేరకు చెన్నై సైబర్ క్రైమ్శాఖ అధికారులు విచారణ చేపట్టి ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఉన్న మరికొందరిని కనిపెట్టే పనిలో ఉన్నారు. కాగా జననాయకన్ చిత్రం ఎడిటింగ్ నుంచి లీక్ అయినట్లు దర్యాప్తులో తేలింది. ఈ చిత్రానికి ప్రదీప్ కె రాఘవ్ పనిచేశారు. ఆయన వద్ద పనిచేసిన సహాయ ఎడిటర్ జననాయకన్ చిత్రాన్ని ఇంటర్నెట్లో లీక్ చేసినట్లు తేలింది. దీంతో చిత్ర ఎడిటర్ ప్రదీప్ కె రాఘవ్కు చిత్ర లీకేజ్తో సంబంధం లేకపోయినా ఆయన దక్షిణ భారత సినీ ఎడిటర్ అసోసియేషన్లో సభ్యత్వం లేని సహాయ ఎడిటర్లతో పనిచేయించినందుకుగాను ప్రదీప్ కె రాఘవ్ను సస్పెండ్ చేసినట్లు ఎడిటర్ అసోసియేషన్ నిర్వాహకులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
విజయ్ ఫ్యాన్స్ ఫైర్
జన నాయగన్ ఎడిటర్ ప్రదీప్ కె రాఘవ్పై విజయ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా విజయ్ శత్రువులతో ఎడిటర్ ప్రదీప్ చేతులు కలిపాడంటూ పోస్టులు పెడుతున్నారు. డబ్బుకు అమ్ముడుపోయి ఇలాంటి పనిచేసి వుంటాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎంతగానో నమ్మిన విజయ్ని ఎలా మోసం చేశావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, అసలు వాస్తవం ఎడిటర్ ప్రదీప్కు ఈ లీక్ వ్యవహారంలో సంబంధం లేదు. సినీ ఎడిటర్ అసోసియేషన్లో సభ్యత్వం లేని సహాయ ఎడిటర్లతో జన నాయగన్ మూవీ కోసం ఆయన పనిచేయించుకోవడంతో సమస్య వచ్చింది. వారి వల్లే ఈ మూవీ లీక్ అయిందని పోలీసులు తెలిపారు.


