కొట్టాడు.. కాల్చాడు.. ప్రేమంటే ఇదేనా? | Mahadev And Sons Faces Backlash For Allegedly Romanticizing Domestic Abuse, Debate Over Toxic TV Romance Rekindled | Sakshi
Sakshi News home page

కొట్టాడు.. కాల్చాడు.. ప్రేమంటే ఇదేనా?

Jun 17 2026 8:09 AM | Updated on Jun 17 2026 9:06 AM

Toxic Romance Row: TV Serial Under Fire

తరాలు మారినా.. టీవీ సీరియళ్ల సాగదీతలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. పైపెచ్చు.. ఓటీటీలు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకుల అభిరుచులను మార్చేసినా, కొన్ని సీరియళ్లలో మాత్రం అదే అతి, అదే అసహజ మలుపులు, అదే విషపూరిత సంబంధాల చిత్రీకరణ కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు కన్నీళ్లు, కుట్రలు, కుటుంబ కలహాలతో నిండిపోయిన కథలు.. ఇప్పుడు హింస, అవమానాలు, మానసిక వేధింపులను కూడా "ప్రేమ"గా చూపించే స్థాయికి చేరాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి విమర్శలకు తాజాగా మహాదేవ్ అండ్ సన్స్ సీరియల్ కేంద్రబిందువైంది. కుటుంబ కథ పేరుతో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌లో భర్త చేతిలో భార్యకు జరిగే శారీరక, మానసిక హింసను రొమాంటిక్‌గా చూపించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. "ఇది ప్రేమ కాదు.. గృహహింస" అంటూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.

వివాదానికి కారణమైన సీన్‌
కలర్స్‌ టీవీలో ప్రసారమవుతున్న మహాదేవ్ అండ్ సన్స్‌ సీరియల్‌లో.. ఇటీవల ప్రసారమైన ఓ సన్నివేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కథానాయకుడు ధీరజ్‌.. కథానాయిక రాజ్జీని తోసేయడం, చెంపదెబ్బ కొట్టడం, ఆమెను మంచంపై బలవంతంగా అదిమిపట్టడం వంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో రాజ్జీ చేయి వేడిగా ఉన్న ఇస్త్రీకి తగిలి కాలిపోతుంది. నొప్పితో ఆమె కేకలు వేస్తుండగా, ధీరజ్ ఆమె నోరు మూసేస్తూ తనకు ఆమెపై ప్రేమ కాదని, ద్వేషమే ఉందని చెబుతాడు.

సాధారణంగా చూస్తే ఇది ఇద్దరి మధ్య ఘర్షణను చూపించే సన్నివేశంలా కనిపించవచ్చు. కానీ దాన్ని చిత్రీకరించిన తీరు, పాత్రల మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్‌తో కలిపి చూపించిన విధానం ప్రేక్షకుల ఆగ్రహానికి కారణమైంది.

నెట్టింట రియాక్షన్లు.. 

సన్నివేశం ప్రసారమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ మొదలైంది.

ఇది ప్రేమ కాదు.. హింస

ఆమెను తోశాడు.. కొట్టాడు.. నీళ్ల బకెట్‌ పోశాడు.. ఇప్పుడు ఇస్త్రీతో కాల్చేశాడు. ఇదంతా చేసి దాన్ని ప్రేమగా చూపిస్తున్నారా? 

గృహహింసను రొమాన్స్‌గా చూపించడం అత్యంత బాధ్యతారాహిత్యం 

మరికొందరు మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ.. భర్త ఎంత హింసించినా భార్య భరించాలి.. చివరకు అతడిని క్షమించాలి అనే సందేశాన్ని ఇలాంటి సీరియళ్లు ఇస్తున్నాయి అంటూ విమర్శించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత కూడా ఈ కార్యక్రమాలను చూస్తారని, ఇలాంటి సన్నివేశాలు సంబంధాలపై తప్పుడు అవగాహన కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అసలు సమస్య ఇదే!
ఈ వివాదం కేవలం ఒక సన్నివేశానికి మాత్రమే పరిమితం కాదు. గత కొన్నేళ్లుగా టీవీ సీరియళ్లలో "టాక్సిక్ రొమాన్స్" అనే ధోరణిపై విమర్శలు పెరుగుతున్నాయి. కోపం, అధికారం చెలాయించడం, మానసిక వేధింపులు, అవమానించడం, కొన్నిసార్లు శారీరక హింసను కూడా ప్రేమలో భాగంగా చూపించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

సామాజిక వర్గాల అభిప్రాయం ప్రకారం, హింసను హింసగానే చూపించాలి. కానీ దాన్ని ప్రేమ, త్యాగం, కుటుంబ బంధం పేరుతో సమర్థించేలా చూపించడం ప్రమాదకరం. ఎందుకంటే అలాంటి కథనాలు విషపూరిత సంబంధాలను కూడా సాధారణం అనే భావనను కలిగించే అవకాశం ఉంటుంది.

మరోవైపు వాదన
అయితే ఈ విమర్శలతో అందరూ ఏకీభవించడం లేదు. కొందరు ప్రేక్షకులు మాత్రం సన్నివేశాన్ని సందర్భం నుంచి వేరు చేసి చూస్తున్నారని వాదిస్తున్నారు. ధీరజ్ ఉద్దేశపూర్వకంగా రాజ్జీని కాల్చలేదని, కథలోని సంక్లిష్టమైన భావోద్వేగ సంఘర్షణను చూపించడానికే ఆ సన్నివేశాన్ని ఉపయోగించారని చెబుతున్నారు.

సీరియళ్లకు హద్దులుండాలా?
టీఆర్‌పీల కోసం సంచలన సన్నివేశాలు చూపించడం కొత్త విషయం కాదు. కానీ గృహహింస, మానసిక వేధింపులు, విషపూరిత సంబంధాలను ప్రేమగా లేదా కుటుంబ బంధాల పేరుతో సమర్థించేలా చూపిస్తే అది కేవలం వినోదం పరిధిలోనే మిగిలిపోదని నిపుణులు చెబుతున్నారు. సమాజంలో ఇప్పటికే ఉన్న సమస్యలను మరింత సాధారణంగా చూపించే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం మహాదేవ్ అండ్ సన్స్పై జరుగుతున్న వివాదం ఒక సీరియల్‌ను దాటి పెద్ద చర్చకు దారి తీసింది. ప్రేక్షకులు నిజంగానే ఈ "టాక్సిక్ రొమాన్స్" కథలతో విసిగిపోయారా? లేక ఇది మరో సోషల్ మీడియా తుఫానుగా మాత్రమే మిగిలిపోతుందా? అనేది పక్కన పెడితే.. ఓటీటీ యుగంలోనూ టెలివిజన్ సీరియళ్ల కథన శైలి, వాటి సామాజిక బాధ్యతపై మరోసారి ప్రశ్నలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement