
టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె. మహేంద్ర (75) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి గుంటూరులో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మహేంద్ర మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో గుంటూరులో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మొదట దర్శకత్వంలో శిక్షణ తీసుకున్న మహేంద్ర తర్వాత నిర్మాతగా మారి 50కు పైగా సినిమాలు తెరకెక్కించారు. చెన్నై నుంచి హైదరబాద్కు సినీ పరిశ్రమ వచ్చాక ఆయన ఏఏ ఆర్ట్స్ బ్యానర్ను నిర్మించారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది కూడా మహేంద్రనే కావడం విశేషం. ఆపై దర్శకుడు గోపీచంద్ మలినేనిని కూడా ఆయనే ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ప్రేమించి పెళ్ళి చేసుకో, ఆరని మంటలు, ఎదురులేని మొనగాడు, ప్రచండ భైరవి, ఢాకూరాణి వంటి చిత్రాలను ఆయన నిర్మించారు.