టాలీవుడ్లో విషాదం. ప్రముఖ సీనియర్ దర్శక నిర్మాత నటుడు చిట్టిబాబు అలియాస్ త్రిపురనేని వరప్రసాద్ కన్నుమూశారు. ఛాతి నొప్పి రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే చికిత్స పొందుతూ ఈయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఈయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
కృష్ణా జిల్లాలోని కాజ గ్రామంలో పుట్టిన చిట్టినబాబు తండ్రి దిగ్గజ రచయిత త్రిపురనేని మహారథి. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు. కెరీర్ ప్రారంభంలో తండ్రి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు.1984లో 'సంతానం' చిత్రంతో డైరెక్టర్ అయ్యారు. తొలి మూవీ హిట్ అయింది. తర్వాత నా పేరు దుర్గ, ప్రళయం, ప్రేమించి చూడు, రైతు భారతం తదితర చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు దర్శకత్వం చేస్తూనే చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. 1976లో 'గరుడాచలం' మూవీతో మొదలుపెట్టి.. భైరవద్వీపం, దశావతారంతో పాటు జాతిరత్నాలు, జాంబీరెడ్డి, దర్జా తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశారు.
నటుడిగా 30 సినిమాలు చేసిన చిట్టిబాబు.. దర్శకుడిగా 12 మూవీస్ తీశారు. 49 చిత్రాలకు కో-డైరెక్టర్గా పనిచేశారు. నిర్మాతగానూ పలు సినిమాలని తెరకెక్కించారు. దివంగత హీరోయిన్ సౌందర్యని టాలీవుడ్కి పరిచయం చేసింది ఈయనే. ఈయన దర్శకత్వంలో చేసిన ఓ సినిమాలో సౌందర్యని రెండో హీరోయిన్గా తీసుకున్నారు. దీనికంటే ముందు ఆమె నటించిన 'మనవరాలి పెళ్లి' రిలీజైంది. తర్వాత చిట్టిబాబు తీసిన 'గెలుపు' చిత్రం ప్రేక్షకులకు ముందుకొచ్చింది.
ఇండస్ట్రీలో ఇలా నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఆకట్టుకున్న చిట్టిబాబు.. రాజకీయాల్లోనూ ఉన్నారు. తొలుత జనతా పార్టీలో చేరారు. 1998లో భాజాపాలోకి వెళ్లారు. మాజీ ప్రధాని వాజ్ పేయి, ఎల్.కె అద్వానీ, వెంకయ్య నాయడు, విద్యా సాగర్ తదితరులతో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.


