హాస్య నటుడు సత్య హీరోగా నటించిన సినిమా ‘జెట్లీ’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రియా సింఘా హీరోయిన్గా నటించగా, ‘వెన్నెల’ కిశోర్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రితేష్ రానా మాట్లాడుతూ– ‘‘జయేంద్ర అనే రచయిత, నేను 2020లో ఓ ఇంటెన్స్ థ్రిల్లర్ స్టోరీ అనుకున్నాం. ఆ కథకు కొంతమంది హీరోలను సంప్రదించాం. కానీ కుదర్లేదు. ఇదే కథలో సత్యది ముందు ఫ్లైట్ అటెండర్ క్యారెక్టర్. ఆ తర్వాత ఈ కథకు కాస్త హ్యూమర్ జోడించి, సత్యతోనే హీరో పాత్ర చేయించాం. ‘నువ్వే హీరో’ అని సత్యకు చెప్పగానే షాక్ అయి, రిస్క్ అన్నారు. కానీ ఈ కథను ఎలా తెరకెక్కిస్తానో చెప్పగానే, హీరోగా నటించేందుకు ఓకే చెప్పారు.
‘వెన్నెల’ కిశోర్గారు ఈ సినిమా అంతా సుడోకు ఆడుకుంటుంటారు. ఆయనది కాస్త టిపికల్ క్యారెక్టర్. రియా సింఘా స్పెషల్ ఏజెంట్ రోల్ చేశారు. అలాగే ఈ సినిమాలోని కీలకమైన ప్రజాపతి పాత్రను అజయ్గారు చేశారు.
ప్రధాన కథ ఆయన పాత్ర చుట్టూ తిరుగుతుంది. ప్రజాపతి యాభైవేల కోట్ల రూపాయల బ్యాంకు స్కామ్ చేసి, పారిపోతాడు. ఆయన్ను దుబాయ్ నుంచి కొచ్చికి తీసుకురావడమే ఈ సినిమా స్టోరీ. యాక్షన్, థ్రిల్, హ్యూమర్తో సాగే మంచి ఎంటర్టైనర్. 80 శాతం కథ ఫ్లైట్లోనే జరుగుతుంది. ఎకానమీ, బిజినెస్ క్లాస్, కార్గో, కాక్పిట్ ఇలా ఒకే ఫ్లోర్పై ఐదు సెట్లు వేశాం.
ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ గురించి ఆలోచిస్తాను. నా నెక్ట్స్ మూవీ హారర్ జానర్లో ఉంటుంది. చెర్రీగారి నిర్మాణంలోనే ఉండొచ్చు. ‘మత్తు వదలరా 3’ సినిమా ఆలోచన ఉంది’’ అని చెప్పారు.


