Renu Desai Request To Fans: Renu Desai Instagram Live Video On Spam Messages - Sakshi
Sakshi News home page

నెటిజన్లపై రేణూ దేశాయ్‌ ఫైర్‌.. ప్రాణాలు పోతున్నాయంటూ..

May 18 2021 5:36 PM | Updated on May 18 2021 7:59 PM

Renu Desai Request To Fans Do Not Send Any Spam Messages - Sakshi

కొంతమంది చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల కారణంగా సరైన సమయంలో సాయం అందక  కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది నెటిజన్లు పెట్టే సరదా సందేశాల వల్ల సాయం అందక కరోనా రోగులు చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణూ దేశాయ్‌.. కరోనా కష్టకాలంలో తనకు దోచిన సాయం అందిస్తుంది. ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా కోవిడ్‌ బాధితులకు ప్లాస్మా, ఆక్సిజన్‌ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్‌ లేదా మందులు.. వంటివి వివరాలను అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. తన ఇన్‌స్టా ఖాతాలో మెసేజ్‌ ఇన్‌ బాక్స్‌లో మెసేజ్‌ పెట్టిన వారికి సమయానికి సరైన వైద్యం అందేలా చూస్తున్నారు. 

అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం ఆమెకు హాయ్‌, హలో అంటూ సరదా మెసేజ్‌లు పంపిస్తున్నారు. వీటిపై రేణూ ఫైర్‌ అయింది. తనకి హాయ్‌, హలో, లేదా ఏదైనా సరదా మెస్సేజ్‌లు పంపించవద్దని, దాని వల్ల కొంత మంది ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

‘దయచేసి నాకు హాయ్‌, హలో అనే మెస్సేజ్‌లు పంపించకండి. మీరు పంపించే మెస్సేజ్‌ల కారణంగా సాయం కోరుతూ పంపుతున్న వాళ్ల మెస్సేజ్‌లు కిందకు వెళ్లిపోతున్నాయి. దానివల్ల నేను ఆ మెస్సేజ్‌లు చూడడానికి కూడా వీలు కావడం లేదు. మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల కారణంగా సరైన సమయంలో సాయం అందక  కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ప్రస్తుతానికి నేను ఎవరికీ ఆర్థిక సాయం చేయడం లేదు. కొవిడ్‌ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి, ఆసుపత్రులు, మందుల విషయంలో నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను. ఇకనైనా మారండి. దయచేసి నాకు సరదా మెస్సేజ్‌లు పెట్టకండి’ అని రేణూ దేశాయ్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు ట్విటర్‌ అకౌంట్‌ లేదని, తన పేరుతో ఎవరో ఫేక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారని, దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement