ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం మంచిదే – నట్టి కుమార్‌

Producer Natti Kumar welcome AP Govt Online Ticketing Portal - Sakshi

‘‘ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం వల్ల సినిమా వసూళ్ల విషయంలో మరింత పారదర్శకత వస్తుంది. కానీ ఈ విధానంపై ప్రభుత్వం మరింత అధ్యయనం చేసి లోపాలు ఉండకుండా చూడాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత నట్టి కుమార్‌. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో నట్టి కుమార్‌ మాట్లాడుతూ – ‘‘పోసాని కృష్ణమురళి ఇంటిపై పవన్‌ కల్యాణ్‌ అభిమానులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను.

అలాగే పోసాని మాట్లాడిన తీరు కూడా కరెక్ట్‌ కాదు. ఇక గత నెల 20న ఏపీ మంత్రి పేర్ని నానీతో కొంతమంది ఇండస్ట్రీ విషయాలను చర్చించారు. ఈ సమావేశానికి వెళ్లొచ్చిన వారు పవన్‌ కల్యాణ్‌కు సరైన రీతిలో వివరించలేదు. అందుకే ఆ తర్వాత పవన్‌ మాట్లాడిన మాటలు (‘రిపబ్లిక్‌’ వేడుకలో) వివాదమయ్యాయని భావిస్తున్నాను. అయితే సినీ రంగం గురించి మాట్లాడేటప్పుడు పవన్‌ వాస్తవిక విషయాలను తెలుసుకుని మాట్లాడితే బాగుండేది’’అని అన్నారు.

ఇదిలా ఉంటే... శుక్రవారం ఉదయం నిర్మాతలు దిల్‌ రాజు, డీవీవీ దానయ్య, నవీన్‌ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్‌ నారంగ్, బన్నీ వాసులు పవన్‌ కల్యాణ్‌ని ఆయన నివాసంలో కలిశారు. చిత్రపరిశ్రమకు సంధించిన సమస్యల గురించి సహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయని తెలిసింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top