పుష్ప 2: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట.. ముగ్గురి అరెస్ట్‌ | Police Arrest 3 Members Over Stampede in Sandhya Theatre at Pushpa 2 Premiere | Sakshi
Sakshi News home page

Pushpa 2: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట.. ముగ్గురి అరెస్ట్‌

Dec 8 2024 7:27 PM | Updated on Dec 9 2024 9:10 AM

Police Arrest 3 Members Over Stampede in Sandhya Theatre at Pushpa 2 Premiere

సాక్షి, హైదరాబాద్‌: పుష్ప 2 ప్రీమియర్స్‌లో భాగంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే  రేవతి మృతిచెందినట్లు తేల్చిన పోలీసులు ఆదివారం ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. సంధ్య థియేటర్‌ యజమాని, సెక్యూరిటీ మేనేజర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే?
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ సంధ్య థియేటర్‌లో డిసెంబర్‌ 4న పుష్ప 2 ప్రీమియర్స్‌ ఏర్పాటు చేశారు. సినిమా చూసేందుకు జనం భారీ ఎత్తున వచ్చారు. సరిగ్గా అదే సమయంలో అల్లు అర్జున్‌ కూడా థియేటర్‌కు రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరగ్గా దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు అటు సంధ్య థియేటర్‌ యాజమన్యంతో పాటు అల్లు అర్జున్‌ టీమ్‌పైనా కేసు నమోదు చేశారు. ఈ విషాదంపై అల్లు అర్జున్‌ స్పందిస్తూ రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

సినిమా విషయానికి వస్తే.. 
అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా మూవీగా రిలీజైంది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు రూ.294 కోట్లు రాబట్టి అందరితో ఔరా అనిపించింది. ఓవరాల్‌గా మూడు రోజుల్లోనే రూ.621 కోట్లు వసూలు చేసింది. పుష్ప దూకుడు చూస్తుంటే వెయ్యి కోట్లు అవలీలగా వచ్చేట్లు కనిపిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement